వరంగల్లో అదృశ్యం.. కశ్మీర్లో ప్రత్యక్షం..13 ఏళ్లకు ఇంటికి...
దేశాన్ని, దేశ ప్రజలకు భద్రంగా కాపాడే ఆర్మీ జవాన్లు ఈ సారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మతిస్థిమితం లేక 13 ఏళ్ల క్రితం తప్పిపోయి దారి తెన్ను తెలియకుండా తిరుగుతున్న ఓ వృద్దుడిని అతని కుటుంబానికి అప్పగించి ఆ కుంటుంబలో ఆనందాన్ని నింపారు
దేశాన్ని, దేశ ప్రజలకు భద్రంగా కాపాడే ఆర్మీ జవాన్లు ఈ సారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మతిస్థిమితం లేక 13 ఏళ్ల క్రితం తప్పిపోయి దారి తెన్ను తెలియకుండా తిరుగుతున్న ఓ వృద్దుడిని అతని కుటుంబానికి అప్పగించి ఆ కుంటుంబలో ఆనందాన్ని నింపారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో కీర్తి మల్లయ్య, శాంతమ్మ దంపతులు జీవనం సాగించే వారు. వారికి కుమారుడు యాకయ్య, కుమార్తె ఉన్నారు. కాగా తండ్రి మల్లయ్యకు కొద్ది రోజులుగా మతిస్థిమితం లేకపోవడంతో అతనికి కొడుకు యాకయ్య వరంగల్ ఎంజీఎంలో చికిత్స చేయించేవాడు. ప్రతి నెల ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించి క్షేమంగా ఇంటికి తీసుకువచ్చేవాడు. ఈ క్రమంలో 2007వ సంవత్సరం ఎండాకాలంలో కూడా వైద్య పరీక్షల నిమిత్తం కొడుకు యాకయ్య తండ్రి మల్లయ్యను ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. కాగా అప్పుడు అనుకోకుండా మల్లయ్య దారి తప్పిపోయాడు. అప్పటి నుంచి ఆయన కుటుంబసభ్యులు అతని ఆచూకీ కోసం గాలించని ప్రదేశం లేదు. ఊరు వాడ ఎక్కడ వెతికినా ఫలితం లేదు, చివరికి వారు స్థానిక పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. అయినా అతను తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు లోనయ్యారు. అలా అలా సుమారుగా 13 ఏండ్లు గడిచిపోయాయి.
ఇన్ని ఏండ్ల తరువాత 2007లో వరంగల్ లో తప్పిపోయిన మలయ్య ఒక్క సారిగా కనిపించాడు. గత నెల 25వ తేదీన మల్లయ్య జమ్మూ, కశ్మీర్లో తిరుగుతూ ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకున్న సీఆర్పీఎఫ్ జవాన్లు విచారించారు. దీంతో ఆ వృద్దుడు తనది నర్సంపేట అని తెలిపారు. దీంతో అతన్ని క్యాంప్లో ఉన్న తెలంగాణ సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు తెలంగాణ రిటైర్డ్ సెంట్రల్ పారామిలటరీ ఫోర్సెస్ వెల్ఫేర్ ఫౌండేషన్కు సమాచారం అందించారు. ఆ తరువాత స్థానిక పోలీసుల సహాయంతో మల్లయ్యను అతని కుటుంబ సభ్యులతో వీడియోకాల్ ద్వారా మాట్లాడించారు. అప్పుడు మల్లయ్య ఆ కుటుంబానికి చెందిన వాడిగా గుర్తంచారు. ఈ క్రమంలోనే ఈనెల 9న జమ్మూలో ఫౌండేషన్ ప్రతినిధులకు మల్లయ్యను అప్పగించడంతో శనివారం రాత్రి స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఆదివారం ఫౌండేషన్ అధ్యక్షుడు మావురం సత్యనారాయణరెడ్డి, నర్సంపేట ఎస్సై యుగేందర్, మల్లయ్యను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా తండ్రిని తమకు అప్పగించిన సీఆర్పీఎçఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు, నర్సంపేట పోలీసులు, ఫౌండేషన్ బృందానికి యాకయ్య కృతజ్ఞతలు తెలిపాడు.