ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉన్నట్టు తెలుస్తోంది. వీరు అధికార పార్టీలో చేరడం ఖాయమై పోయిందని టిఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఇద్దర్ని చేర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్లో చేరికపై వీరు అధికారిక ప్రకటన కూడా చేసినట్టు సమాచారం.
కేసీఆర్ సమక్షంలో ఆదివారం గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. కాగా రేగా, ఆత్రం బాటలోనే మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం మధ్యాహ్నం కేసీఆర్ను కలిశారు. ఆయన కూడా తెరాసలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.