Vijayashanti Fire on CM KCR : శిశుపాలుడి తప్పుల లాగా సీఎం కేసీఆర్ తప్పులు పెరుగుతున్నాయి : విజయశాంతి

Update: 2020-07-07 12:05 GMT

Vijayashanti fire on CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి నిప్పులు చెరిగారు. శిశుపాలుడి తప్పులు మాదిరిగా, సీఎం కేసీఆర్ గారి తప్పులు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. దొరగాను ఇంతకాలం ప్రజాతీర్పు తనకు అనుకూలంగా ఉందని విర్రవీగిన పోతున్నారన్నారు. తెలంగాణ ప్రజల తిరస్కారాన్ని, తిరుగుబాటును ఎదుర్కొనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనెలకొంటున్న తాజా పరిణామాలను చూస్తుంటే పరిస్థితి అర్థం అవుతోందన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలు ఇస్తూ, మాయమాటలు చెప్పి, తనను మేధావిగా ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో చేతులెత్తేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారిందన్నారు.

కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదు అని ప్రతిపక్షాలు హెచ్చరిస్తే సీఎం దొరగారు దాన్ని అవహేళన చేశారని ఆగ్రహించారు. కరోనా కట్టడికి తగిన వైద్య వసతులు లేవని పత్రికల్లో వార్తలు వస్తే వాటి యాజమాన్యంపై కెసిఆర్ శాపనార్థాలు పెట్టారని తెలిపారు. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టినా సీఎం దొరగారు దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఇక పరిస్థితి చేయి దాటి పోతుంది అని గ్రహించి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు స్వయంగా జోక్యం చేసుకుని, సంక్షోభ నివారణకు చొరవ తీసుకుంటే దానిని కూడా సీఎం దొర అడ్డుకోవడం నిరంకుశత్వానికి పరాకాష్ట అని అన్నారు. సీఎం కెసిఆర్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైన కారణంగా, గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని తెలంగాణ ప్రజలు సైతం స్వాగతిస్తున్నారన్నారు. ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేయడం కంటే, సీఎం కేసీఆర్ గారు ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం మేలని సెలవిచ్చారు. లేనిపక్షంలో  తెలంగాణ సమాజ ఆగ్రహ జ్వాలలు తారా స్థాయికి చేరుతాయనడంలో సందేహం లేదని హెచ్చరించారు.

Tags:    

Similar News