కరోనాతో సహజీవనం తప్పేలా లేదు : మంత్రి హరీశ్ రావు
ప్రజలందరి సహకారంతో కరోనా వైరస్ ను విజయవంతంగా ఎదుర్కొందామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ అన్నారు.
ప్రజలందరి సహకారంతో కరోనా వైరస్ ను విజయవంతంగా ఎదుర్కొందామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ అన్నారు. సిద్దిపేట అంబేద్కర్ నగర్లో కరుణ క్రాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు 1,400 మంది పేదప్రజలకు ఆయన నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో మరికొన్నాళ్లు సహజీవనం తప్పేటట్లు లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలంతా ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించాలని, కరోనా వైరస్ ను తరిమి కొట్టడంతో ప్రజలు సహకారం ఎంతో అవసరం అని ఆయన అన్నారు. ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని, లేదంటే రూ. వెయ్యి జరిమానా తప్పదన్నారు.
లాక్ డౌన్ లో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొకుండా ఉండాలని ప్రభుత్వం ఆరోగ్య భద్రత కార్డు ఉన్న కుటుంబాలకు రూ.1500 ఆర్థికసాయం, మనిషికి 12కిలోల బియ్యాన్ని అందజేస్తుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని అర్హులందరికీ రెండో విడత రూ. 1,500 చొప్పున పంపిణీ చేసినట్లు చెప్పారు. సిద్దిపేటలో ఇప్పటికే 12 వేల మందికి సహాయం అందించినట్లు చెప్పారు.
ప్రస్తుత సంక్షోభ సమయంలో రాష్ట్రంలో అనేకమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. పేద వారి ఆకలిని తీరుస్తున్నారని, నిత్యావసర వస్తువులను పేదలకు అందజేస్తున్నారని వారిని మంత్రి కొనియాడారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. సిద్దిపేట గ్రీన్ జోన్లో ఉన్నా నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.