హైదరాబాద్ నగరంలో ఉన్న ఎన్నో ఎకరాల ప్రభుత్వ భూముల రక్షణ చర్యలపై మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఎంసీఆర్హెచ్ఆర్డీలో నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి పనిచేయాలని తెలిపారు. వివాదాల్లోని ప్రభుత్వ భూముల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అర్హులైన పేదలకు భూములు క్రమబద్దీకరించి హక్కులు కల్పించినట్లు ఆయన ఈ సమావేశంలో చెప్పారు.
మరోసారి పేదలకు భూహక్కుల కల్పనపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. లీజ్ నిబంధనలు మార్చి ఆయా శాఖలకు మరింత ఆదాయం వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దశాబ్దాల క్రితం నాటి లీజ్లను సమీక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలను ప్రజాప్రయోజనాలకు వినియోగించడంపైనా పరిశీలన చేయాలని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. రెవెన్యూ, దేవాదాయ భూములపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలకు జియో ఫెన్సింగ్, జీఐఎస్ మ్యాపింగ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, సుధీర్రెడ్డి, కేపీ వివేకానంద, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పాల్గొన్నారు.