కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జలకళ ఉట్టిపడుతున్నది. గోదావరి జలాలతో ఒక్క రైతులే కాకుండా మత్స్యకారులు కూడా ఎంతో లాభపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు సమృద్ధిగా నీటితో నిండివున్నాయి. దీంతో చేపలు ఉత్పత్తి పెరిగిపోయింది. దీంతో మత్య్సకారులు సంబరాలను జరుపుకుంటున్నారు. మృగశిరకార్తె ప్రారంభమై వర్షాలు పడే రోజులు దగ్గరపడే సమయంలో చేపలు పట్టుకొంటూ పరవశించి పోతున్నారు.
ఇక చేపలు పట్టుకుని తెలంగాణ మత్స్యకారుల ఎంతగా ఆనందపడిపోతున్నారో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కండ్లకు కట్టినట్లుగా చెప్పారు. ప్రభుత్వ పరంగా మద్దతు లభించడంతో, రాష్ట్రంలో నీటి లభ్యత ఉండటం చేపలు, రొయ్యల ఉత్పత్తి స్థిరంగా అభివృద్ధి చెందేందుకు దారితీస్తుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన ప్రయోజనాల్లో మత్స్య సంపద అభివృద్ధి కూడా ఒకటి అని ఆయన అన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మత్స్యకారులకు చేపలు పట్టేందుకు కావాల్సిన సామగ్రి, పడవలు, రిటైల్ విక్రయాల కోసం వాహనాలను సమకూర్చడం వంటి చర్యలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో అందజేస్తున్నారని అన్నారు. ఆయన చేస్తున్న కృషికి అభినందనలు తెలుపుతున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ ఏడాది తెలంగాణ మత్స్యశాఖ 15 వేల టన్నుల మంచినీటి రొయ్యలను దాటి ఉత్పత్తి జరుగుతున్నదని అలాగే, 3.2 లక్షల టన్నుల మంచినీటి చేపలను ఉత్పత్తి చేసిందని హర్షం వ్యక్తంచేశారు. వివిధ జిల్లాల్లో మత్స్యకారులు చేపలు పట్టుకొని సంతోషం వ్యక్తం చేస్తున్న పలువురి ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.