తెలంగాణ నూతన సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల కోసం పాతకట్టడాల కూల్చివేతపై హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లను ధర్మాసనం విచారణ చేపట్టింది. కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్లో ఉన్న హెరిటేజ్ భవనం కూల్చివేతపై దాఖలైన పిటిషన్పై అడ్వకేట్ రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం అసెంబ్లీ కొత్త డిజైన్ ప్లాన్తో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రాఫిక్కు ఇబ్బందిగా ఉన్న ప్రాంతంలో అది కూడా హెరిటేజ్ భవనం కూల్చి ఎందుకు కట్టలనుకుంటున్నారని ప్రశ్నించింది. ఈ సందర్భంగా గూగుల్ మ్యాప్ ద్వారా ఎర్రమంజిల్ ఛాయచిత్రాన్ని హైకోర్టు పరిశీలించింది. ఈ సందర్భంగా ఉన్న నిర్మాణాలను వదిలేసి కొత్తవి కట్టాల్సిన అవసరమేముందన్న హైకోర్టు హెరిటేజ్ భవనాలను కూల్చాల్సిన కారణాలు చెప్పాలని ఆదేశించింది. అసెంబ్లీ, సెక్రెటేరియట్ నిర్మాణాలపై ప్రభుత్వం దగ్గరున్న ప్లాన్స్ నూతన భవనాల నిర్మాణ అవసరాలపై వివరాలు అందించాలన్న కోర్టు తదుపరి విచారణను.. జులై 8 కి వాయిదా వేసింది.