Paddy Bonus 2026: రైతులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్: వడ్ల బోనస్ నిధులు విడుదల.. నేరుగా ఖాతాల్లోకి రూ.500!
Paddy Bonus 2026: రాష్ట్రంలోని వరి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది.
Paddy Bonus 2026: రాష్ట్రంలోని వరి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన సన్న వడ్ల బోనస్ బకాయిలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం మొత్తం రూ.514.36 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 2025-26 ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేసిన సుమారు 2.17 లక్షల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఈ నిధులతో పాటు, పౌరసరఫరాల సంస్థ కూడా వరి బోనస్ నిమిత్తం మరో రూ.1,939.58 కోట్లను విడుదల చేయనుంది. దీనితో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి త్వరలోనే నగదు జమ కానుంది.
వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. "కనీస మద్దతు ధర (MSP) కంటే అదనంగా ఈ రూ.500 బోనస్ను అందిస్తున్నాం. బకాయిల చెల్లింపుతో రైతులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం కలుగుతుంది" అని ఆయన పేర్కొన్నారు.
సాగును ప్రోత్సహించడంతో పాటు, సన్న రకం వడ్ల సాగును పెంచేందుకు ఈ బోనస్ ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత కొంతకాలంగా బోనస్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఈ నిధుల విడుదలతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.