Uttam Kumar Reddy: తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు.. మున్సిపల్ ఫలితాలే ప్రభుత్వానికి నిదర్శనం
Uttam Kumar Reddy: తెలంగాణలో వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Uttam Kumar Reddy: తెలంగాణలో వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెఫరెండం అని ఆయన అభివర్ణించారు. నిజామాబాద్ మేయర్గా సామాన్య కార్యకర్త ఉమారాణి ఎన్నికవ్వడం పట్ల ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు:
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను, ప్రస్తుత కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు. "మత రాజకీయాలతో ఉత్తర భారతంలో లబ్ధి పొందుతున్న బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు. ఇక్కడ మత ప్రాతిపదికన ఓట్లు దండుకోవాలనుకునే వారికి చోటు లేదు" అని ఆయన ఘాటుగా విమర్శించారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యం:
మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. దేశంలోనే సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పారు. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడికను తీయించి, ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీరందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని, ఉమారాణి మేయర్ పీఠాన్ని అధిరోహించడమే అందుకు నిదర్శనమని ఆయన కొనియాడారు.