Rythu Bharosa: 4 పథకాల అమల్లో బిగ్ ట్విస్ట్.. రేషన్ కార్డులు, రైతు భరోసా ఇచ్చేది ఇప్పుడే కాదు
Indiramma Housing Scheme: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవం సందర్బంగా 4 సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నారు. అయితే ఈ పథకాలు పూర్తి స్థాయిలో అమలుకు మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నూతనంగా వచ్చిన లక్షలాది దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం రెండు నెలల సమయం తీసుకోనుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా స్పష్టం చేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పథకాల ప్రారంభోత్సవం కోసం ఒక్కో జిల్లాలోని ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పథకాలు ఫిబ్రవరి మొదటివారం నుంచి మార్చి 31లోగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఈ నాలుగు స్కీములు మేలు చేసే విధంగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే లబ్దిదారుల ఎంపికకు మరింత జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పథకాల ప్రకటనపై ప్రజల్లో పెద్దెత్తున ఆసక్తి నెలకున్నప్పటికీ అమలు ఆలస్యం అవ్వడంతో ప్రజల్లో కొంత అసంత్రుప్తికి దారితీస్తుంది. గ్రామ సభల ద్వారా ఎంపిక చేసిన జాబితాల్లో కొంతమంది అర్హుల పేర్లు లేకపోవడంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా వెల్లడించిన జాబితాల్లో పేరు వచ్చినా సరే అర్హులు అని చెప్పలేమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.