లాక్ డౌన్ పెంచమని పీఎంని కోరాను : సీఎం కేసీఆర్
ప్రస్తుతం మన దేశంలో లాక్ డౌన్ కొనసాగించాల్సిందే అని సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో తెలిపారు.
ప్రస్తుతం మన దేశంలో లాక్ డౌన్ కొనసాగించాల్సిందే అని సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో తెలిపారు. తెలంగాణ సమాజాన్ని బతికించుకున్నామంటే లాక్డౌన్, స్వీయ నియంత్రణ వల్లే అయిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ రోజు న్యూయార్క్ నగరాన్ని చూస్తే శవాల గుట్టలే కనిపిస్తున్నాయన్నారు. అలాంటి దీన పరిస్థితి ఎవరికి రావొద్దని ఆయన అన్నారు. మనమైతే ఆగమయ్యేవాళ్లం. లాక్డౌన్ వల్లనే పరిస్థితిని కంట్రోల్ చేశాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇది ప్రపంచానికి వచ్చిన పీడ. ఒక్క కుటుంబానికో, జాతికో రాలేదు అని అన్నారు.
లాక్ డౌన్ ఎంత గట్టిగా పాటిస్తే అంత మంచిదని, ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మన దేశాన్ని కాపాడు కోవడానికి లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదు అని ఆయన తేల్చిచెప్పారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇండియాలో జూన్ 3 వరకు లాక్డౌన్ పాటించాలని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. లాక్డౌన్ వల్ల ఆర్థికంగా నష్టపోక తప్పదు అని అన్నారు. ప్రజలను బతికించుకోవాలంటే లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదు. లాక్ డౌన్ పై ప్రధానితో రోజుకు రెండుసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.
లాక్డౌన్ సడలించడమంటే అంత ఆషామాషీ కాదన్నారు. జపాన్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, కొలంబియా, అర్జెంటీనా, సింగపూర్, నేపాల్తో పాటు మరిన్ని దేశాలు మన పద్ధతిలోనే లాక్డౌన్ చేశాయి. 90 దేశాలు పాక్షికంగా లాక్డౌన్ చేశారు. 22 దేశాలు పూర్తిగా 100 శాతం లాక్డౌన్ చేశాయి. ప్రధాని మోదీని ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్ డౌన్ ను పొడిగించాలని కోరుతానని ఆయన పేర్కొన్నారు.ఇక పోతే ప్రతి రోజు రాష్ట్రానికి రూ. 400 నుంచి రూ. 430 కోట్ల ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం రూ. 6 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. ఒక వేళ లాక్డౌన్ సడలిస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి? అని సీఎం ప్రశ్నించారు.