Telangana Cabinet: ఉద్యోగాల వివరాలపై అధికారులకు కేబినెట్ కీలక ఆదేశాలు

Telangana Cabinet: విభాగాలవారీగా ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య, ఖాళీలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఐదు రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను రాష్ట్ర క్యాబినెట్‌ ఆదేశించింది.

Update: 2021-07-15 04:16 GMT

కే చంద్రశేఖర్‌రావు(ఫైల్ ఇమేజ్ )

Telangana Cabinet: విభాగాలవారీగా ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య, ఖాళీలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఐదు రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను రాష్ట్ర క్యాబినెట్‌ ఆదేశించింది. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు.

సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని అందుకు సరికొత్త పోస్టుల అవసరం పడుతున్నదని కేబినెట్ అభిప్రాయపడింది. అదే సందర్భంలో కాలం చెల్లిన కొన్ని పోస్టుల అవసరం లేకుండా పోతున్నదని, కాలానుగుణంగా ఉద్యోగ వ్యవస్థలో కూడా మార్పులు చోటు చేసుకోవాలని సూచించింది. తద్వారా ప్రజలకు మరింత చేరువగా పాలనను తీసుకెళ్లి వారికి ప్రభుత్వ సేవలందించే వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఏర్పాటు చేసుకోవాలని, ఆ దిశగా చర్యలకు పూనుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను, అధికారులను కేబినెట్ ఆదేశించింది.

రెండు రాష్ట్రాల నడుమ ఉద్యోగుల విభజన పూర్తయిందని, ఆంధ్రాలో మిగిలిన ఉద్యోగులను కూడా ఈ మధ్యనే తెలంగాణకు తెచ్చుకున్నామని కేబినెట్ తెలిపింది. ఇంకా కూడా మిగిలిపోయిన 200 నుంచి 300 తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రా నుంచి తీసుకురాబోతున్నామన్నది. ఈ అన్ని సందర్భాలను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రా నుంచి వచ్చే ఉద్యోగులందరినీ కలుపుకుని ఇంకా మిగిలివున్న ఖాళీలను సత్వరమే గుర్తించి కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందచేయాలని, మంత్రి మండలి అధికారులను ఆదేశించింది. అన్ని ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తులను క్రోడీకరించి జిల్లా వారీగా, విభాగాల వారీగా సంకలనం చేయాలని కేబినెట్ ఆదేశించింది. ప్రస్థుత ఉద్యోగుల సంఖ్య, ఖాళీల సంఖ్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అన్ని విభాగాలనుంచి 5 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని కేబినెట్ ఆదేశించింది.

Tags:    

Similar News