మూసీ ప్రక్షాళన ముసుగులో పేదల ఇళ్లు కూల్చొద్దు.. సర్కార్పై బీజేపీ చీఫ్ నిప్పులు!
మూసీ నది ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రాజెక్ట్ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తే సహించబోమని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్రావు స్పష్టం చేశారు.
మూసీ ప్రక్షాళన ముసుగులో పేదల ఇళ్లు కూల్చొద్దు.. సర్కార్పై బీజేపీ చీఫ్ నిప్పులు!
హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళన విషయంలో తెలంగాణ బీజేపీ తన వైఖరిని స్పష్టం చేసింది. మూసీ నదిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని, అయితే ఆ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్రావు హెచ్చరించారు.
సందేహాలు - వాస్తవాలు:
హైదరాబాద్ సోమాజిగూడలోని ఒక హోటల్లో 'మూసీ పునరుజ్జీవం - వాస్తవాలు' అనే అంశంపై ఆయన అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. "ఎన్నికల హామీల అమలుకే నిధులు లేవంటున్న ప్రభుత్వం, మూసీ ప్రక్షాళన కోసం వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తుంది?" అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ డీఎన్ఏలోనే అభివృద్ధి లేదు:
గత 60 ఏళ్ల పాలనలో మూసీ నదిని ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్ నేతలను ఆయన నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే అభివృద్ధి లేదని మండిపడ్డారు. ప్రాజెక్ట్ డిజైన్ల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలికారు.
బీజేపీ డిమాండ్:
ప్రభుత్వం పట్టుదలకు పోకుండా, పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండానే మూసీ నది పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.