అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఉదంతంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. బాచారంలో సర్వే నెంబర్ 90 నుండి 102 వరకు ఉన్న మొత్తం 130 ఎకరాల భూమిపై హైకోర్టు, కలెక్టరేట్లోనూ కేసులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో భూమి తమకు విక్రయించారంటూ సయ్యద్ యాసిన్ అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. 2015లో కౌలుదారులు చట్టం ప్రకారం అహ్మద్ హయత్తో పాటు మరి కొంతమందికి హక్కులు కల్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. తమ భూములు వేరేవారికి అమ్మకాలు చేస్తున్నారని కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు.
ఔటర్ రింగ్ రోడ్డు వేసిన తర్వాత ఇక్కడున్న భూమికి గిరాకీ పెరిగింది. దీంతో ఈ భూమి తమదంటే తమదంటూ కొందరు రియాల్టర్లు వచ్చారు. అయితే ఈ వివాదాస్పద భూమిలో నిందితుడు సురేష్ కుటుంబానికి 8 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. తన 8 ఎకరాల భూమిని వేరేవారి పేరుపై పాస్పుస్తకాలు ఇస్తున్నారనే సురేష్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం తహశీల్దార్పై సురేష్ ఒత్తిడి తెచ్చాడని అయితే విజయారెడ్డికి తనకు అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.