Telangana: అనివార్యంగా మారిన ఐపీఎస్ల బదిలీలు
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కొన్ని కారణాల వలన కొన్నిపోస్టులు సుదీర్ఘకాలంగా ఇన్చార్జ్ల నేతృత్వంలో కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కొన్ని కారణాల వలన కొన్నిపోస్టులు సుదీర్ఘకాలంగా ఇన్చార్జ్ల నేతృత్వంలో కొనసాగుతున్నాయి. అంతే కాకుండా మరికొంత మంది అధికారులు పదోన్నతి పొంది బదిలీ కోసం ఎదురు చూస్తున్నారు. మరోపక్క కొంత మంది అధికారులు నెలాఖరుకు రిటైర్ కానున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీ అనివార్యంగా మారింది. సాధారణంగా ప్రతి ఏటా బోనాల పండగ సమయంలో నగరంలో భారీ స్థాయిలో బందోబస్తు అవసరం ఉన్న నేపథ్యంలో బదీలీలపై ప్రభావం పడేది. కానీ కరోనా కారణంగా ప్రజలందరూ బోనాల పండుగను ఇళ్లల్లోనే జరుపుకోవడంతో ఈ ఏడాది ట్రాన్స్ఫర్స్కు లైన్క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు బదిలీల జాబితాకు తుదిమెరుగులు దిద్ది ఈ నెలాఖరు లోగా ప్రభుత్వానికి నివేదించి ఉత్తర్వులు జారీ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక రాష్ట్ర రాజధాని భౌగోళికంగా ఒకటైనప్పటికీ మూడు కమిషనరేట్లకు ఉన్నాయి. ఆ కమిషనరేట్లని ఐజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు కమిషనర్లుగా వ్యవహరిస్తుంటారు. వారిలో సైబరాబాద్, రాచకొండలకు ఐజీ హోదాల్లో వీసీ సజ్జనార్, మహేష్ మురళీధర్ భగవత్, హైదరాబాద్కు అదనపు డీజీ స్థాయిలో అంజనీకుమర్ వహిస్తున్నారు. రెండేళ్లపాటు ఈ పోస్టులను టెన్యూర్ పీరియడ్గా పరిగణించి, ఆ తరువాత వారిని ఏ క్షణమైనా బదిలీలు చేస్తారు. కానీ ఇప్పటికే సైబరాబాద్ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్లు ఆ పోస్టుల్లోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది. కాగా రాచకొండ సీపీ గా విధులు నిర్వహించిన మహేష్ భగవత్కు టెన్యూర్ పూర్తి కావడంతో ఆయనకు ఇటీవలే అదనపు డీజీగా పదోన్నతి వచ్చింది. ఇక నగరంలోనే మూడు కమిషనరుట్లలో ఈ నెలాఖరు లోపు భారీ బదిలీలతో కొత్త టీమ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.