ఢిల్లీ మానవహక్కుల కమిషన్ను కలుస్తాం : అశ్వత్థామరెడ్డి
ఢిల్లీలోని మానవహక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ను ఈనెల 13, 14వ తేదీల్లో కలువనున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.
నిన్న నిర్వహించిన చలో ట్యాంక్బండ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులందరికీ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. విద్యానగర్లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మట్లాడారు. ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకుల్లో నలుగురు సోమవారం నిరాహార దీక్ష చేయనున్నారని ఆయన తెలిపారు. ఢిల్లీలోని మానవహక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ను ఈనెల 13, 14వ తేదీల్లో కలుస్తామని ఆయన వెల్లడించారు.
అంతే కాకుండా కార్మికులపై జరిగిన దాడికి నిరసనగా ఈ నెల 18వ తేదీన సడక్ బంద్ కార్యక్రమాన్నినిర్వహిస్తామని తెలిపారు. కార్మికులపై ఎంత అరాచకంగా దాడి చేసారో దానికి సంబంధించిన ఫోటోల ప్రదర్శన కార్యక్రమం చేపడతామని ఆయన తెలిపారు. అనంతరం చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో పాల్గొన్నకార్మికులను ముఖ్యంగా ఎంతో ధైర్య సాహసాలతో పోలీసులను ఎదిరించి మరీ నిరసనలో పాల్గొన్న మహిళా కార్మికులు కొనియాడారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలవాలని లేదంటే సోమవారం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని జేఏసీ నేతలు ఈ సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు వీ.హనుమంతరావు, సంపత్కుమార్, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు.