నూతన సంవత్సరంలో పవర్ షాక్..!
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఇది చేదు వార్త అనే చెప్పుకోవాలి.
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఇది చేదు వార్త అనే చెప్పుకోవాలి. గృహ, వాణిజ్య, వాప్యారాలు ఇలా అన్ని కేటగిరీల వినియోగదారులపై విద్యుత్ చార్జీల పెంపు ప్రభావం పడనుంది. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఏటేటా పెరిగిపోతుంది. దీంతో రాష్ట్రంలోని విద్యుత్ డిస్కంలు చార్జీల పెంపును ప్రతిపాదించనున్నాయి. మునిసిపల్ ఎన్నికలు జనవరి 25తో ముగియనుండగా, ఈఆర్సీకి డిస్కంలు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో భాగంగా ఈ పెంపు ప్రతిపాదనలను జనవరి 31న సమర్పించనున్నాయి.
సుమారు రూ.1000 కోట్ల అదనపు ఆదాయాన్ని రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంపు ద్వారా ఆర్జించాలని డిస్కంలు ప్రయత్నిస్తున్నాయి. గత మూడేళ్లుగా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతించలేదు. దీంతో 2019–20 ముగిసే వరకు డిస్కంల ఆర్థిక లోటు రూ. 11,000 కోట్లకు చేరనుందని విద్యుత్ ఇంధనశాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం బడ్జెట్లో రూ.6,079 కోట్లను మాత్రమే కేటాయించింద ఇంధనశాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో విద్యుత్ రాయితీలు పోగా మొత్తం రూ.5,000 కోట్ల ఆర్థిక లోటు మిగల నుందన్నారు. ఇక అన్ని సబ్సీడీలు తీసేసినా 2020–21లో ఆర్థిక లోటు రూ. 6,000 కోట్లకు చేరనుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక ఈ విద్యుత్ చార్జీలు పెంచిన భారమంతా మధ్యతరగతి, ఎగువతరగతి వారిపైనే పడనుంది. ఈ చార్జీలు పారిశ్రామిక కేటగిరీ స్వల్పంగా పెంచే అవకాశాలున్నాయి. నెలకు 300 యూనిట్లపైగా వినియోగించే ఎగువ తరగతి, 100–200 యూనిట్ల విద్యుత్ వినియోగించే మధ్యతరగతి కుటుంబాలపైనే ఈ ప్రభావం ఎక్కువ చూపనుంది. ఈ చార్జీల పెంపు 2020 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి రానుంది.