ప్రతీ ఏటా నూతన సంవత్సరం ప్రారంభం రోజున పోలీసులు ఒక మంచి పనికి శ్రీకారం చుడతారు. ఆడుకోవలసిన బాల్యంలో వెట్టి చాకిరీచేస్తూ మగ్గిపోతున్న చిన్నారులను చాకిరి చెర నుంచి విముక్తులను చేస్తారు. ఇదే కోణంలో ఈ ఏడాది కూడా పోలీసు యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
వెట్టి చాకిరిలో మగ్గిపోతున్న చిట్టి చేతులను కాపాడి, వారి ముఖంలో చిరునవ్వును తిరిగితేవాలని చూస్తోంది. ఈ సందర్భంగానే ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని చేపడుతుంది. ప్రతి ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ పేరిట పోలీసులు చేపడుతున్న దాడులు సత్ఫలితాలను ఇస్తోంది. రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారులు, బాలికల వివరాలను సేకరించి ఫొటోలతో ఆల్బమ్ను తయారు చేస్తారు. అనంతరం వారిని వెతికే కార్యక్రమం చేపడతారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసమ్మర్థం ఉన్న జంక్షన్లు, చౌరస్తాలను తనిఖీ చేస్తాయి. ఈ విధంగా ప్రతి ఏటా వేలాది మంది చిన్నారులకు విముక్తి కలిగిస్తున్నారు.
ఇక ఈ ఏడాది జరిగే దాడుల్లో దళిత, గిరిజన పిల్లలను గుర్తిస్తే యజమానులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టనున్నారు. 2020 మొత్తం వెట్టిచాకిరి, పిల్లల అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని డీజీపీ మహేందర్రెడ్డి అన్ని జిల్లాల పోలీసులకు సూచించారు. దీనికిగాను ప్రతీ సబ్ డివిజన్లో ఒక ఎస్ఐ, నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు కలిగిన ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ టీమ్లో ఒక మహిళా సిబ్బంది కూడా ఉంటారు.