రియల్ లైఫ్ సినిమా కథ.. పాత కక్షలు.. కిరాయి హంతకులు..ఏం ప్లాన్ రా బాబు
పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిని హత్య చేసేందుకు రూ.9 లక్షల సుపారీతో కుట్ర పన్నిన ఆరుగురు వ్యక్తులను మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్టు చేశారు.
పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిని హత్య చేసేందుకు రూ.9 లక్షల సుపారీతో కుట్ర పన్నిన ఆరుగురు వ్యక్తులను మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు ఈ కుట్రను భగ్నం చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... వట్టేపల్లికి చెందిన ఇమ్రాన్ ఖాన్, మరో వ్యక్తితో కలిసి సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేసేవారు. వారి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా వ్యాపార భాగస్వామ్యం ముగిసింది. ఏడాది క్రితం ఇమ్రాన్ ఖాన్పై దాడి కేసులో జైలుకు వెళ్లిన షేక్ అమీర్, మహ్మద్ సోహైల్కు సూత్రధారి వట్టేపల్లికి చెందిన వ్యక్తేనని ఇమ్రాన్ ఖాన్ అనుమానించాడు.
దీంతో అతన్ని అంతం చేయాలని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఇబ్రహీం, సైఫ్, శ్రీరామ్, షాబాజ్, షయాబ్, బవాజిర్ అనే ఆరుగురు సుపారీ గ్యాంగ్తో రూ.9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్గా రూ.60 వేలు చెల్లించాడు. ఆరుగురిలో శ్రీరామ్ అనే వ్యక్తి ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో హోమ్గార్డుగా పనిచేస్తున్నాడు.
పథకం ప్రకారం, నిందితులందరూ మంగళవారం వట్టేపల్లిలోని నైస్ హోటల్కు చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కత్తులు, రెండు బైక్లు, రెండు మొబైల్ ఫోన్లు, రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.