నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రణయ్ హత్య కేసులో కోర్టులో పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. 1200 పేజీల చార్జ్షీట్ను పోలీసులు దాఖలు చేశారు. ప్రణయ్ హత్య కేసులో మొత్తం102 మంది సాక్షులను విచారించారు. ప్రణయ్ కేసులో ఏ-1గా మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. మారుతీరావు ఆత్మహత్యకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ను కూడా పొందుపర్చారు.
ఇవాళ మరోసారి ప్రణయ్ కేసును నల్గొండ స్పెషల్ కోర్టు విచారించనుంది. మార్చి 3న విచారించిన న్యాయమూర్తి అనంతరం నిందితులపై మోపబడిన అభియోగాలపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో తదుపరి విచారణను ఇవాళ్టికి(మార్చి10) వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకోవడంతో.. కేసు విచారణలో మార్పులుండే అవకాశం ఉందనే వాదన వ్యక్తమవుతోంది.
ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావుతో పాటు కేసులో ఏ5గా ఉన్న కరీం తన లాయర్ను మార్చుకోవడానికి గడువు కావాలని కోరడంతో కోర్టు వారికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కాగా.. నిందితులు తమపై వచ్చిన అభియోగాలపై కోర్టుకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. దీంతో అందరినీ పోలీసులు కోర్టులో ఇవాళ హాజరుపర్చనున్నారు.