Poachers take toll on wild animals in Nalgonda forests : అడవుల్లో పెద్దఎత్తున జంతువుల వేట

Update: 2020-07-26 11:30 GMT

నల్గొండ జిల్లాలో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. నల్లమల, అమ్రాబాద్‌, దేవరకొండ అడవుల్లో అరుదైన జంతువులను వేటాడుతూ మాంసాన్ని విక్రయిస్తున్నారు. కొన్ని నెలలుగా పెద్దఎత్తున జంతువుల వేట సాగుతోంది. వేటగాళ్ల ఉచ్చుకు ఇటీవల ఒక చిరుత బలైపోగా, అరుదైన పునుగు పిల్లి కూరగా మారిపోయింది. నల్గొండ జిల్లాలో విచ్చలవిడిగా సాగుతోన్న అటవీ జంతువుల వధపై HMTV స్పెషల్ రిపోర్ట్.

నల్గొండ జిల్లా అమ్రాబాద్‌ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌పై కేటుగాళ్ల కన్నుపడిండి. ఈ అడవిలో చిరుత పులులతోపాటు దుప్పిలు, అడవి పందులు, కుందేళ్లు, జింకలు, నెమళ్లు, ఉడుములు, మనుబోతులతోపాటు అనేక రకాల జంతువులు, పక్షులు ఉండటంతో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. అడవి జంతువులను వేటాడి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల వేటగాళ్ల ఉచ్చులో రెండు చిరుతలు చిక్కడంతో, ఒకటి మృత్యువాత పడగా, మరొకదాన్ని రక్షించి నల్లమల అడవిలో వదిలిపెట్టారు ఫారెస్ట్ అధికారులు. అయితే, అమ్రాబాద్‌ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌‌లో వేటగాళ్లు విచ్చలవిడిగా జంతువులను వేటాడుతున్నా అటవీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో పెద్దఎత్తున అడవి జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నా, పట్టించుకోవడం లేదని అంటున్నారు.

ఇక, అత్యంత అరుదైన పునుగు పిల్లిని పట్టుకోవడం చాలా కష్టం, కానీ వేటలో ఆరితేరిన కేటుగాళ్లు చాలా సులువుగా అడవి జంతువులను బంధిస్తున్నారు. అయితే, దేవరకొండ అటవీ ప్రాంతంలో పునుగు పిల్లిని వేటగాళ్లు పట్టుకోవడం కలకలం రేపింది. ఆ పునుగు పిల్లిని విక్రయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వేటగాళ్లు పట్టుబడ్డారు. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ‌్‌నగర్ జిల్లాల్లో పలువురు అటవీ జంతువుల వేటనే ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. అయితే, వేటగాళ్లు అప్పుడప్పుడూ పట్టుబడుతున్నా, అటవీ అధికారులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో అరుదైన జంతువుల ఉనికి ప్రశ్నార‌్ధకంగా మారుతోందని స్థానికులు అంటున్నారు.

Tags:    

Similar News