నిజామాబాద్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టు కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడించారు. దిల్లీకి వెళ్లి వచ్చిన కరోనా పాజిటివ్ వ్యక్తి కుటుంబంలో ఒకరికి పాజిటివ్గా తేలిందన్నారు. మరో ఆరుగురికి నెగిటివ్గా తేలిందన్న కలెక్టర్ ఇంకా ఇద్దరి రిపోర్ట్లు రావాల్సి ఉందన్నారు. మరోవైపు, నిజామాబాద్లో కరోనా తనిఖీల కోసం ఇంటింటికీ వస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి కొన్ని చోట్ల చుక్కెదురవుతోంది.
నగరంలోని ఖిల్లా రోడ్డులో ఆరోగ్య సమాచారం తెలుసుకొనేందుకు వచ్చిన సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. వారు ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లెక్కల కోసం వస్తున్నారని స్థానికులు ఆరోపించారు. కరోనా వేళ వైద్య సమాచారం పేరుతో ఇలా ఎందుకు చేస్తున్నారని కాలనీల పెద్దలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
ప్రజలు ఎవరూ కూడా వారి ఇళ్ల నుండి బయటకు రాకుండా సామాజిక దూరం పాటించాలని, కరోనా వైరస్ జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ అధికారులు ఇళ్లకు వచ్చి కరోనాకు సంబంధించిన సమాచారాన్ని అడిగితే తప్పనిసరిగా ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యాలపై జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని ప్రకటనలో కలెక్టర్ సూచించారు.