KCR: గ్రాండ్గా రీ ఎంట్రీ ఇవ్వనున్న కేసీఆర్
KCR: ఫిబ్రవరి 20న గజ్వేల్కు వెళ్లనున్నారని సమాచారం
KCR: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ పనిచేయలేదు.. మూడోసారి అధికారంలోకి రావాలనే గులాబీ బాస్ వ్యూహం ఫలించలేదు.. దానికి తోడు స్థానిక నేతలపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కారణంగా కారు పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడం... ఫాంహౌస్లోని బాత్రూంలో కేసీఆర్ కాలుజారి పడి తుంటి ఎముక విరగడం.. ఆసుపత్రిలో చేరడం... లాంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకున్నాయి. అయితే పార్టీని మళ్లీ గాడిలో పెట్టే పనిని కేసీఆర్... తనయుడు కేటీఆర్తో నడిపిస్తున్నారు.. త్వరలోనే తెలంగాణ భవన్కు... అటు గజ్వేల్ నియోజకవర్గ పర్యటనకు గులాబీ బాస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది..
కేసీఆర్ మాట బీఆర్ఎస్లో జవదాటే వారే లేదు... పార్టీ స్థాపించినప్పటి నుంచి తిరుగులేని అధిక్యాన్ని కొనసాగించారు. అయితే ఓటమి తర్వాత పార్టీలో అసంతృప్తిపై దృష్టి పెట్టిన కేసీఆర్.. క్షేత్రస్థాయి పరిస్థితిపై ఆరా తీయడం మొదలు పెట్టారు. మరోవైపు ఇంటి వద్ద రెస్టుకు తీసుకుంటున్న కేసీఆర్.. తనను పరామర్శించే వారిని కలుస్తూ.. హైదరాబాద్లోని నందినగర్లో ఉంటున్నారు. రీసెంట్గా ఆయన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయనను కలిసి పరామర్శించారు. దానికి తోడు ఆంధ్రలో రాజకీయ పరిస్థితులపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఏపీలో మరోసారి జగన్ గెలవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇందుకోసం రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ కంటే తామే బలంగా ఉన్నామనే ధీమా కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు... తెలంగాణలో గెలిచిన ఉత్సాహంతో కాంగ్రెస్, మరోసారి దేశంలో పాగా వేయాలనే తలంపుతో బీజేపీ పోటీ పడున్నాయి. ఈ నేపథ్యంలో... కేసీఆర్ రీ ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.... కాసింత గ్యాప్తో ప్రజల్లోకి వెళ్లే వేళ.. ఆయన రీ ఎంట్రీ ప్రోగ్రాం గ్రాండ్గా ఉండాలన్నట్లు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ మళ్లీ మునుపటి మనిషిగా... ఆరోగ్యంగా ఫిట్గా... ఉంటే పార్టీ శ్రేణుల్లో కూడా ధీమా సడలకుండా ఉంటుందని భావిస్తున్నారు.
ఆయన కోలుకున్న తర్వాత తొలుత తన ఫాంహౌజ్కు వెళ్లి కొద్దిరోజులు రెస్ట్ తీసుకోనున్నారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు... ప్రస్తుతానికి హైదరాబాద్లో డాక్టర్లకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నందీనగర్లో నివాసంలో ఉంటున్నారు. రీసెంట్గా కేసీఆర్ తన ఫాంహౌజ్లో వ్యవసాయ పని కోసం... విత్తనాలు... ఎరువుల కోసం ఓ ఫెర్టిలైజర్ షాప్ యజమానికి ఫోన్ చేసి మాట్లాడారు. త్వరలోనే ఫాంహౌజ్కు వస్తానని ఫోన్లో చెప్పారు కేసీఆర్.... మరోవైపు ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీనికి మించిన మంచి సందర్భం ఇంకొకటి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుట్టిన రోజున గ్రాండ్గా రీ ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్న కేసీఆర్కు... తెలంగాణ భవన్లో స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జంట నగరాల్లో భారీ ఎత్తున హోర్డింగులు.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జనం మధ్యకు వచ్చే సందర్భం గ్రాండ్గా ఉండాలన్నది గులాబీ నాయకత్వ ఆలోచనగా చెబుతున్నారు.
లోకసభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ల కోసం ప్యారాచూట్ నేతలు... పార్టీకి చెందిన ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. సైతం ఆరోజు గులాబీ బాస్ను కలుస్తారని.. ఇందుకు తెలంగాణ భవన్ వేదికగా మారుతుందని చెబుతున్నారు. గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్కు ఫిబ్రవరి 20 తర్వాత వెళ్లి.. నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతారని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగా భారీ ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. వీటికి కొనసాగింపుగా.. లోకసభ ఎన్నికలకు కాస్త ముందుగా వరంగల్లో భారీ సభను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు... ఈ సభ ద్వారా పార్టీ బలాన్ని ప్రదర్శించేలా ఉండాలన్నది గులాబీ నేతల ఆలోచనగా చెబుతున్నారు.
మొత్తానికి కేసీఆర్ యాక్టివ్ పాలిట్రిక్స్ ఎప్పుడూ చేస్తారు కానీ.. ఆయన అందుబాటులో లేకపోవడం.. పార్టీ సీనియర్ నేతలతు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ద్వారా రోజు వారీగా పరిస్థితులను తెలిపి... పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ క్షేత్రస్థాయిలోకి వస్తే పార్టీ నేతలు... కార్యకర్తలు... మరింత ఉత్సాహంగా పనిచేస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.