తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.వి శ్యామ్ ప్రసాద్ లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రామడుగు: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.వి శ్యామ్ ప్రసాద్ లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాల వారిగా భూ సమస్యలు ఎంతవరకు పెండింగ్ లో ఉన్నాయని ఆయా గ్రామాల వీఆర్వోలను ప్రశ్నించారు. కొంత మంది రైతులకు ఇంకా పాత పాస్ బుక్కులు ఉన్నాయని, కొత్త పాస్ బుక్కులు ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు.
దీంతో కొంతమంది వీఆర్వోలు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో విధులు సక్రమంగా నిర్వహించకపోతే ఉద్యోగాలు ఉండవని హెచ్చరించారు. అనంతరం తమకు ఇప్పటికీ పాత పాస్ బుక్కులు ఉన్నాయని కొత్త పాస్ బుక్కులు నేటివరకు రాలేదని కార్యాలయంలోని అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగిన ఫలితం లేదని జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ కు రైతులు విన్నవించారు. ఏమైనా భూ సమస్యలు ఉంటే నేరుగా తహసీల్దార్ ని సంప్రదించాలని సూచించారు.
వారం రోజుల్లోపు తహసీల్దార్ ఆఫీస్ లో సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ వద్దకు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చింతల కోమల్ రెడ్డి, డీటీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్ఐ లక్ష్మణ్, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.