జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పన్నెండు మంది తో కూడిన ఈ కమిటీని కార్యకర్తల అభీష్టంతో మేరకు ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షునిగా రాధారం రాజలింగం, ఉపాధ్యక్షులుగా దామరోజు వెంకటాచారి, అచ్చుకట్ల భాను ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా చిన్నమదిరెడ్డి దామోదర రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా శ్రీ మీర్జా అబిద్, బిట్ల రమేష్, వాకా వెంకటేష్, సిటీ కమిటీ కార్యదర్శులుగా నందగిరి సతీష్ కుమార్, మండలి దయాకర్, కార్యనిర్వాహక సభ్యులుగా యడమ రాజేష్, శ్రీ గనప సైమన్ ప్రభాకర్ (కిరణ్), షక్ రియాజ్ వలి లను నియమించారు. వీరంతా ఆదివారం మధ్యాహ్నం ప్రశాసన్ నగర్ లోని జనసేన ప్రధాన కార్యాలయంలో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజా సేవకు అంకితమవుతూ, పార్టీ మూల సిద్దాంతాలకు అనుగుణంగా త్రికరణశుద్దిగా పార్టీ అభివృద్దికి
కృషి చేస్తామని ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా నూతన కమిటీ సభ్యులను పవన్ కళ్యాణ్ అభినందించారు . ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని ఉద్భోధించారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవ చేయాలనీ సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ కమిటీ నియామకంతో తెలంగాణాలో పార్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఇదేవిధంగా గ్రామ కమిటీల వరకు అంచెలంచెలుగా పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. తొలుత ఉమ్మడి జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు త్వరలోనే పూర్తి చేయాలని పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి. మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంచార్జి శ్రీ శంకర్ గౌడ్ ను ఆదేశించారు. కాగా కమిటీ సభ్యులతో అధ్యక్షుల పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు క్రీ అరహం ఖాన్ పాల్గొన్నారు. ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ ఇవాళ విజయవాడ రానున్నారు. మంగళగిరిలో జరిగే పార్టీ అత్యవసర సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.