ఫైర్, ఇతర భద్రతా ప్రమాణాలు పాటించకుండా శిక్షణా సంస్థలు నిర్వహిస్తున్న వారిపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. గతంలో సూరత్ లోని ఓ కోచింగ్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగి 23 మంది మరణించారు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం నగరంలోని నిబంధనలు పాటించని శిక్షణా సంస్థలన్నిటికీ జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ విధంగా అమీర్పేట్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, అశోక్నగర్లో 671 సంస్థలు నోటీసులు అందుకున్నాయి. ఈ నోటీసులు అందుకున్నవారిలో 170 మంది తమకు కొంత సమయం కావాలంటూ అర్జీలు పెట్టుకున్నాయి. ఆయా సంస్థలకు సమయం ఇచ్చిన జీహెచ్ఎంసీ నోటీసులకు స్పందించని సంస్థల కొరడా ఝుళిపించింది. ఈరోజు అమీర్ పేట, మైత్రీవనం ప్రాంతాల్లో 20 శిక్షణా సంస్థల్ని సీజ్ చేశారు అధికారులు.
జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే నిలువరించేందుకు ఎటువంటి రక్షణ ఏర్పాట్లూ లేకపోగా కనీసం గాలి వెళ్లే అవకాశం లేకుండా ఆయా సంస్థలకు ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారని, ఇటువంటి సంస్థలను తాము సీజ్ చేసినట్లు విశ్వజిత్ వెల్లడించారు. అమీర్పేట్లోని ప్రముఖ ఐటీ శిక్షణ సంస్థలైన ఎస్ఎస్ ల్యాబ్స్, ఇండెక్స్ ఐటీ టెక్నాలజీ, సన్స్క్రీన్ టెక్నాలజీ, సత్య ఐటీ సొల్యూషన్స్, క్యాపిటల్ ఐటీ టెక్నాలజీ, ఇమాక్స్ టెక్నాలజీ, అవని టెక్నాలజీ, హర్ష టెక్నాలజీ, జేపీఎస్ టెక్నాలజీ, ఐనెట్ తదితర సంస్థలను సీజ్ చేసినట్లు వివరించారు. ఇకపైనా దాడులు కొనసాగిస్తామని అధికారులు హెచ్చరించారు.