తెలంగాణలో యూరియా కొరతను నివారించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ యూరియా దొరక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని భట్టి ప్రశ్నించారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే ఓ రైతు చనిపోవడం తనను కలిచివేసిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు పెట్టి కొందామన్నా యూరియా దొరకడం లేదని వాపోయారు. రైతు బంధు, రుణమాఫీ పథకాలను అమలుచేయకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు. ఎన్నికల వేళ హడావిడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడం దుర్మార్గమన్నారు. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదు, మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీనియర్ నేతలతో చర్చలు జరిపామని తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టం చేశారు.