ఎన్ కౌంటర్ పై హైకోర్టు విచారణ: మృతదేహాలను 9 వరకు భద్రపరచాలని ఆదేశం
నిన్న తెల్లవారు జామున జరిగిన దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై హైకోర్టు ఉత్తర్వులు జారీ జేసింది.
నిన్న తెల్లవారు జామున జరిగిన దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై హైకోర్టు ఉత్తర్వులు జారీ జేసింది.చటాన్పల్లిలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని, ఇందుకు బాధ్యులైన పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ మహిళా హక్కు లు, ప్రజా సంఘాల ప్రతినిధులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ సెలవులో ఉన్నందున ఆ ఫిర్యాదును సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు పరిశీలించి, సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి కేసును విచారణకు స్వీకరించారు. ఆయన నివాసంలో ధర్మాసనం సమావేశమై విచారణ జరిపింది. ఈ విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరయ్యారు.
మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రిలో నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోందని, వీడియో చిత్రీకరించినట్టు ఏజీ చెప్పారు. మృత దేహాలను పోస్టు మార్టం చేసే సమయంలో తీసిన వీడియోను భద్ర పరచాలని, ఆ వీడియో, సీడీ, పెన్ డ్రైవ్ లను మహబూబ్ నగర్ జిల్లా జడ్జికి ఇవ్వాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రతి ఒక్క అధికారులందరికీ ఇవ్వాలని ఏజీకీ సూచించారు.
ఈ పిటిషన్ తదుపరి విచారణ కోసం 9 న ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేస్తామని, ఆ ఆధారాలను విచారణలో ఉంచాలని ఆదేశించారు. అనంతరం ఈ నెల 9 వ తేదీ రాత్రి 8 గంటల వరకూ వారి మృతదేహాలను భద్రపర్చాలని తెలిపారు.