ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఓ యువకుడిని గ్రామస్థులు కాపాడారు. ధర్మారం నుంచి చెరుకూరు వైపు బైక్ పై వెళ్తున్న యువకుడు వరద ప్రవాహంలో వాహనంతో సహా కొట్టుకు పోతుండటాన్ని గమనించిన గ్రామస్థులు రక్షించారు. నలుగురు వ్యక్తులు యువకుడిని పట్టుకుని నీటి ప్రవాహం నుంచి బయటకు తీశారు.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కుండపోత వర్షాలతో బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు చత్తీస్ గడ్ అడవుల నుంచి ఉప్పెనలా వస్తున్న వరద నీటితో రాతి కట్టపై నుంచి ప్రమాదకరంగా బొగత జలపాతం ప్రవహిస్తుంది. బొగత జలపాతం వద్ద భారీ స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేశారు. సందర్శనకు వచ్చే పర్యాటకులను నిలిపివేస్తున్నారు. రెండు రోజులపాటు వాయిదా వేసుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.