కరోనా వైరస్ సోకిన రోగులకు ప్రత్యేకంగా చికిత్స అందించిన ఆస్పత్రుల నుంచి రోజుకు సుమారు టన్నుపైగానే వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యర్ధాలను సేకరించి జాగ్రత్తగా శుద్ధి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 128 క్వారంటైన్ కేంద్రాలు, 12 ప్రభుత్వ ఆస్పత్రులు, 10 ల్యాబ్లు, 7 నమూనా సేకరణ కేంద్రాల నుంచి నిత్యం కోవిడ్ జీవ వ్యర్థాలను సేకరిస్తున్నారు. ఆస్పత్రులు, సిరంజీలు, కాటన్, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లు, క్వారంటైన్ కేంద్రాల్లో వాడిన మాస్క్లు, గ్లౌస్లు, దుస్తులు, మలమూత్రాలు, మెడిసిన్స్ కవర్స్ ను కోవిడ్ వ్యర్థాలుగా పరిగణిస్తున్నారు. ఈ వ్యర్థాలను సేకరించేందుకు సుమారు 55 ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేసారు.
ఈ జీవ వ్యర్థాలను ఇతర వ్యర్దాలతో పడవేస్తే వ్యాధి మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉడడంతో పీసీబీ వర్గాలు, శుద్ధి కేంద్రాల నిర్వాహకులు వీటిని జాగ్రత్తగా శుద్ధి కేంద్రాలకు పంపిస్తున్నారు. రాష్ట్రంలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, వనపర్తి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో ఉన్న 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ సెంటర్లకు తరలించి వాటిని జాగ్రత్తగా విచ్ఛిన్నం చేస్తున్నారు. సుమారు 200 మంది సిబ్బంది ఈ కేంద్రాల్లో పనిచేస్తున్నారు. ఒక్క విడుతలో కాకుండా రెండు విడతలుగా ప్రత్యేక యంత్రాల్లో కాల్చి బూడిద చేస్తున్నారు. ఆ తరువాత వాటిని ప్రత్యేక బాక్సుల్లో నిల్వ చేసి దుండిగల్లోని హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రానికి తరలించి పూడుస్తున్నారు.