ఆపదలో ఉన్న మహిళలకు జీహెచ్ఎంసీ అండ
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్లపైన, మార్కెట్లో, షాపుల్లో, కార్యాలయాల్లో ఒక్కటేమిటి ఎక్కడ పడితే అక్కడ మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి.
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్లపైన, మార్కెట్లో, షాపుల్లో, కార్యాలయాల్లో ఒక్కటేమిటి ఎక్కడ పడితే అక్కడ మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి. దీంతో ఎంతో మంది మహిళలు సమాజంలో బయటికి వెళ్లడానికి భయపడుతున్నారు. దీంతో మహిళలకు రక్షణ కల్పించే విధంగా జీహెచ్ఎంసీ ఓ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీకి సంబంధించిన కార్యాలయాల్లో వేధింపులను నివారించుటకు మరింత పటిష్ట చర్యలు తీసుకోనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జీహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ బుధవారం జారీచేశారు. గతంలో మహిళలపై జరిగే వేధింపులను ఆపడానికి ప్రభుత్వం కార్యాలయాలలో తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఇప్పుడు మళ్లీ పునర్వ్యవస్థీకరిస్తూ అమలులో తీసుకొచ్చిందని అన్నారు.
ఈ కమిటీ ఏర్పాటు ఉత్తర్వులను జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని విభాగాలకు జోనల్, సర్కిల్ కార్యాలయాలకు పంపినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు తెలిపారు.ఇకపోతే ఈ కమిటీలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్, మరో ఇద్దరు సభ్యులు బదిలీ అయినందున ఆ కమిటీని ఇప్పుడు మళ్లీ పునర్వ్యవస్థీకరిస్తున్నామని చెప్పారు.
ఇందులో భాగంగానే అంతర్గత ఫిర్యాదుల కమిటీ అంతర్గత సభ్యులుగా రెవెన్యూ, ట్యాక్స్, లీగల్ విభాగాల అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలా, ఎన్నికల విభాగం జాయింట్ కమిషనర్ ఎస్.పంకజ, పరిపాలన విభాగం జాయింట్ కమిషనర్ పి.సరోజ, అడిషనల్ కమిషనర్ (అడ్మిన్) ఎ.విజయలక్ష్మి, పరిపాలన విభాగం ఏ.ఎం.సి కె.శారద, కూకట్ పల్లి జోనల్ కమిషనర్ వి.మమత, ఖైరతాబాద్ సర్కిల్ డిప్యూటి కమిషనర్ బి.గీతారాధికలతో పాటు సయోద్య హోం ఫర్ ఉమెన్ ఇన్ నీడ్ చీఫ్ మెంటార్ వేములపాటి మృదులను ఈ జాబితాలో నియమించారు. ఈ ఎనిమిది మంది సభ్యులుగా ఉన్న ఈ కమిటీకి ఛైర్మన్గా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పి.ప్రావిణ్య వ్యవహరించనున్నారు. మహిళలకు ఏదైనా ఇబ్బందులు, ఫిర్యాదులు ఉంటే ఇ-మెయిల్ ఐ.డి sheboxghmc@gmail.com కు ఫిర్యాదు చేయాలని సూచించారు.