Shamshabad : శంషాబాద్లో ఎయిర్గన్ కాల్పులు కలకలం
శంషాబాద్లో కాల్పుల కలకలం ఎయిర్గన్తో కాల్పులు జరిపిన గుర్తుతెలియని వ్యక్తి ఆటో ఛార్జీ విషయంలో తలెత్తిన వివాదం ఎయిర్గన్తో కాల్పులు జరిపిన దుండగుడు
Shamshabad : శంషాబాద్లో ఎయిర్గన్ కాల్పులు కలకలం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఎయిర్గన్తో కాల్పులు జరిపాడు ఓ గుర్తుతెలియని వ్యక్తి. ఆటో ఛార్జీ విషయంలో వివాదం తలెత్తగా.. ఎయిర్గన్తో కాల్పులు జరిపాడు దుండగుడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాకు చెందిన శివశంకర్ దాస్.. బ్రతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చాడు. పాతబస్తీ ఘాన్సీ బజార్ కోకరవాడిలో నివాసం ఉంటూ.. చార్మినార్ సమీపంలో గోల్డ్ స్మిత్గా పనిచేస్తున్నాడు. అయితే.. కొన్నేళ్ల క్రితం శంషాబాద్ మండలం నర్కుడలో ఓ ఇంటిస్థలం కొనుగోలు చేసిన శివశంకర్ దాస్.. అక్కడ నిర్మాణాన్ని చేపట్టాడు. గృహప్రవేశం సమయం దగ్గర పడుతుండటంతో దగ్గర ఉండి నిర్మాణ పనులు పూర్తి చేయిస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు శివశంకర్ సిద్ధమవుతుండగా.. అదే సమయంలో అతడి అల్లుడు పింటూ.. తన స్నేహితులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. నిర్మాణంలో ఉన్న భవనాన్ని చూసిన తర్వాత రాత్రి సమయంలో బయల్దేరేందుకు ప్రయత్నించగా.. పింటు బైక్ స్టార్ట్ కాలేదు. దీంతో ఆటోలో వెళ్దామని నిర్ణయించుకుని.. ఓ ఆటోను ఆపారు.
పాతబస్తీ సిటీ కాలేజ్ వరకు ఆటోను మాట్లాడుకోగా.. ఆటో ఛార్జీ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఆటో ఎక్కేందుకు శివశంకర్, పింటు నిరాకరించడంతో గొడవ జరిగింది. అదే సమయంలో ఆటోలో వెనుక కూర్చున్న ఓ వ్యక్తి ఎయిర్గన్తో శివశంకర్పై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో శివశంకర్ కడుపు భాగంలో గాయమైంది. డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.