Eamcet 2021: తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభం
Eamcet 2021: మొత్తం 105 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ * తెలంగాణలో 82, ఏపీలో 23 పరీక్ష కేంద్రాలు
Eamcet 2021: తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 10వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. ఆగస్ట్ 6 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్, ఆగస్ట్ 9, 10తేదీల్లో మెడికల్ అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్ జరగనుండగా ఎంసెట్కు మొత్తం 2లక్షల 51వేల 132 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో లక్షా 64వేల 678 మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులు, మెడికల్ అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్ అభ్యర్థులు 86వేల 454 మంది ఉన్నారు.
ఎంసెట్ పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండో సెషన్ జరగనుంది. ఎంసెట్ కోసం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 105 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో 82, ఏపీలో 23 సెంటర్లలో ఎంసెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇంటర్లో 70 శాతం సిలబస్ నుంచే ఎంసెట్ పరీక్షల నిర్వహణ జరుగుతుండగా మొత్తం 160 మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి.. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని, మాస్క్, శానిటైజర్ తప్పకుండా వెంట తెచ్చుకోవాలని సూచించారు. కోవిడ్ లక్షణాలు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక రూమ్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే.. కోవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థుల కోసం మరోసారి ప్రత్యేకంగా టెస్ట్ నిర్వహించే ఏర్పాటు చేస్తున్నామన్నారు.