చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఉపయోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీని తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉపయోగించటం మొదలుపెట్టారు. కరోనా మహమ్మారిపై డ్రోన్లతో యుద్ధం చేస్తున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. స్పీకర్ల ద్వారా హెచ్చరికలు చేస్తున్నారు.
కరోనా మహమ్మారిపై పోరులో డ్రోన్ లు ఉపయోగిస్తున్నారు. సాధారణంగా నిఘా కోసం ఉపయోగించే డ్రోన్ లను ఇప్పుడు కరోనా కట్టడికి వాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా కరీంనగర్ లో కరోనా వ్యాప్తి నిరోధానికి డ్రోన్ లు ఉపయోగించారు.
కరీంనగర్లోని ముకరంపూర్ ప్రాంతం. కరోనాకు రెడ్ జోన్. ఇండొనేషియా నుంచి వచ్చిన పది మందికి ఒక స్థానికుడు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం. అక్కడ ఎలాంటి వైరస్ లేకుండా చేయటానికి అధికారులు అత్యాధునిక డ్రోన్లను ఉపయోగించారు. వాటి ద్వారా ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు.
కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మాస్కులు, బాడీ సూట్స్ వేసుకొని పారిశుద్ధ్య సిబ్బంంది కెమికల్స్ను స్ప్రే చేస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న వైరస్ వ్యాపించే అవకాశముంది. అనేక దేశాల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఈ వైరస్ సోకుతోంది. ఇందుకోసం కరోనా ఎఫెక్ట్ ప్రాంతాలను డ్రోన్ల ద్వారా శుద్ధి చేయటం ఒకటే మార్గం. చైనా, దక్షిణ కొరియాల్లో డ్రోన్ల ద్వారా శుద్ధి చేస్తున్నారు.
కరోనా ప్రభావిత ప్రాంతం కరీంనగర్ తో పాటు వరంగల్లో డ్రోన్ ల ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఒక వ్యక్తి చేసే పనికి 50 రెట్ల పనిని ఈ డ్రోన్లు చేయగలుగుతాయి. 20 కిలోమీటర్ల ప్రాంతంలో ఒక రోజులో స్ప్రే చేసేందుకు అవకాశం ఉంటుంది.
నిఘా కెమెరాలను పెట్టి ఎక్కువ జన సమూహం ఉన్న ప్రాంతాల్లో స్పీకర్ల ద్వారా హెచ్చరికలను జారీ చేసే అవకాశం వుంది. అలాగే అత్యవసర సామగ్రిని చేరవేసే డ్రోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను 8 నిమిషాల్లో చేరుకుంటాయి.
ఒకో డ్రోన్ 25 కిలోలు ఉంటుంది. రసాయనాలు స్ప్రే చేసే డ్రోన్లో 10 కిలోల ట్యాంకు ఉంటుంది. డ్రోన్ లను నియంత్రించటానికి పైలెట్, కోపైలెట్లు ఉంటారు. త్వరలో కరోనా ప్రభావిత జిల్లాల్లో డ్రోన్ ల ద్వారా శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు.