Warangal: సూది బెజ్జంలో అమెరికా అధ్యక్షుడి శిల్పం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి భారత దేశంలో కూడా చాలా మంది అభిమానులున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి భారత దేశంలో కూడా చాలా మంది అభిమానులున్నారు. కొంత మంది ఆయన మీద ఉన్న అభిమానాన్ని విగ్రహం పెట్టి చాటుతుంటే, మరి కొంత మంది ఆయన ఇండియాకి వస్తున్నారని గుడిలో పూజలు చేసి అభిమానాన్ని చాటుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ సూక్ష్మ శిల్పి తన అభిమానాన్ని చాటుకున్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన జాతీయ సూక్ష్మశిల్పి మట్టెవాడ అజయ్ కుమార్ ఇప్పటి వరకూ ఎన్నోసూక్ష్మ శిల్పాలను చెక్కి అవార్డులను దక్కించుకున్నారు. ఈ సారి ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూక్ష్మశిల్పాన్ని 1.00 మిల్లిమీటర్ల సూదిరంధ్రంలో మైనంతో చెక్కి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతే కాదు ఆ సూది బెజ్జంలో అమెరికా జెండాను కూడా తయారు చేసి పెట్టాడు. దీంతో ఆ సూక్ష్మప్రతిమ సూది బెజ్జంలో ఎంతో అందంగా కనిపిస్తుంది.
ఈ సూక్ష్మశిల్పాన్ని తయారు చేసేందుకు శిల్పికి 4 రోజుల 13 గంటల సమయం పట్టిందట. గతంలో కూడా ఆయన ఇదే కవిధంగా దండి మార్చ్, ప్రధాని మోదీ సూక్ష్మ శిల్పాలను సూది రంధ్రంలో చెక్కి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అంతే కాదు ఆయన గతేడాది అక్టోబర్లో తొలిసారిగా ఏసీజీ వరల్డ్ గ్రూప్ వారు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఆర్ట్ ఇన్ ఆ క్యాప్సుల్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. అప్పుడు కూడా అందరినీ అబ్బురపరిచే రీతిలో సూక్ష్మ శిల్పాలను చెక్కి మొదటి బహుమతిగా 5 వేల డాలర్ ప్రైజ్మనీ గెలుపొందారు అజయ్ కుమార్.
ఈ కాంపిటీషన్లో ఇండియా, అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్ దేశాల నుంచి 80 మంది సూక్ష్మ కళాకారులు పాల్గొన్నారు. ప్రస్తుతం అజయ్ చెక్కిన ట్రంప్ సూక్ష్మ శిల్పం సైజును చూసుకుంటే అది 1.25 మి.మీ ఎత్తులో ఉంది, దాని వెడల్పు 0.32 మి.మీ.గా ఉంది. ఇక అమెరికా జాతీయ జెండా 0.94 మి.మీ. ఎత్తు ఉండగా, దాని వెడల్పు 0.64 మి.మీ. ఉంది.