హైదరాబాద్ సిటీలో లిస్బన్ క్లబ్ డ్యాన్సర్ పై జరిగిన దాడికి సంబంధించి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆరా తీశారు. ఘటనపై పంజగుట్ట సీఐతో ఫోన్ లో మాట్లాడిన డీజీపీ ఈ కేసుకు సంబంధించిన నివేదిక అందించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన క్లబ్ డ్యాన్సర్ పై దాడి ఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దాడికి సంబంధించి బాధితురాలి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సరిగా స్పందించలేదంటూ బాధితురాలు చెప్పిన విషయంపై డీజీపీ మహేందర్ రెడ్డి ఎంక్వయిరీ చేశారు. బాధితురాలు 100 కి ఫోన్ చేసినా స్పందించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ పంజగుట్ట పోలీసులను ఆదేశించారు.
క్లబ్ డ్యాన్సర్ పై దాడి ఘటన.. ఆ తర్వాత పరిణామాలపై మీడియాలో వచ్చిన కథనాల తర్వాత పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. బాధితురాలు చేసిన ఆరోపణలు నిజమైతే సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పంజగుట్ట ఏసీపీ ప్రకటించారు. పొట్టకూటి కోసం వచ్చి డ్యాన్సర్ గా మారిన యువతిపై దాడి చేస వివస్త్రను చేసన ఘటనపై మహిళ సంఘాలు మండి పడుతున్నాయి. పోలీసులు పబ్లు, క్లబ్లకు అండగా నిలవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.