ఇంటర్ విద్యార్థులకు శుభవార్త : ఒకేషనల్ కోర్సులో అప్రెంటిస్షిప్ షురూ..
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియట్ శుభవార్తను తెలిపింది. ప్రస్తు్తం ఇంటర్ విద్యను చదువుతున్నవారు, గతేడాది ఇంటర్ పూర్తి చేసుకున్నవారికి చేసుకున్నవారి కోసం అప్రెంటిస్షిప్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 4ఏళ్లకు ముందు శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ఇంటర్లో వొకేషనల్ కోర్సులను చదువుకున్న వారికి అప్రెంటిస్షిప్ విధానాన్ని తొలగించారు. దీంతో ఏడాది కాలం అప్రెంటిస్షిప్ చేయనందున ప్రభుత్వ ఉద్యోగాలకు తాము అనర్హులం అవుతున్నామని విద్యార్థులు ఆందోళన చెందారు.
ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వొకేషనల్ కోర్సులను రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (ఆర్డీఎస్డీఈ) పరిధిలోకి తీసుకురాలని ప్రయత్నించగా, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ చేసిన ప్రయత్నం ఫలించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని 46 ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇంటర్లో పారా మెడికల్, ఇతర సాంకేతిక విద్యా కోర్సులను చదివే విద్యార్థులకు అప్రెంటిస్షిప్ అవకాశం కల్పించే సంస్థలు ఆర్డీఎస్డీఈలో నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం ఇంటర్ విద్యను ముగించుకుని ఖాలీగా ఉన్న విద్యార్థుల అప్రెంటిస్షిప్ అవసరాలపై చర్చించారు. దీంతో స్పందించిన ఆస్పత్రి యాజమాన్యాలు తమకు ఫార్మా టెక్నాలజీ (పీహెచ్టీ), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ), ఫిజియోథెరపీ (పీటీ), మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులు కావాలని తెలిపారు. వచ్చే మార్చి/ఏప్రిల్లో అప్రెంటిస్ మేళా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందులో పాల్గొని విద్యార్థులను ఎంపిక చేసుకోవాలని కోరారు. ఆయా సంస్థలు ఆర్డీఎస్డీఈ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు.