తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఒకే నెలలో మూడు బహిరంగ సభలు.. హైదరాబాద్లో ప్రధాని మోడీ భారీ రోడ్ షో..
BJP Target Telangana: కర్ణాటక ఎన్నికలతో డీలా పడిన తెలంగాణ బీజేపీ నేతల్లో జోష్ నింపేందుకు ఆ పార్టీ అధిష్టానం ఫోకస్ పెంచింది.
తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఒకే నెలలో మూడు బహిరంగ సభలు.. హైదరాబాద్లో ప్రధాని మోడీ భారీ రోడ్ షో..
BJP Target Telangana: కర్ణాటక ఎన్నికలతో డీలా పడిన తెలంగాణ బీజేపీ నేతల్లో జోష్ నింపేందుకు ఆ పార్టీ అధిష్టానం ఫోకస్ పెంచింది. తెలంగాణలో పట్టు బిగించేందుకు ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కమలదళం ప్రణాళికలు చేస్తోంది. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే ఉందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఆ పార్టీ కొద్దిరోజులుగా కార్యాచరణలు చేస్తూ వస్తోంది. గతంలో పోల్చుకుంటే ప్రస్తుతం బీజేపీ రాష్ట్రంలో కాస్త బలంగా కనిపిస్తోంది. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత సీన్ కాస్త మారింది. కాంగ్రెస్ కేడర్ అంతా మళ్లీ ఊపందుకుంది. దీంతో కాంగ్రెస్ను వెనక్కి నెట్టి బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఉండాలంటే బీజేపీ తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతల పర్యటనలు జరిగితే పార్టీ కేడర్ను యాక్టివ్ చేయొచ్చనే భావనలో ఉంది.
ఒకే నెలలో బీజేపీ మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ సభలకు అగ్రనేతలైన అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు ప్రధాని మోడీని ఆహ్వానించాలని భావించింది. తమ ప్రతిపాదనను హైకమాండ్కు కూడా చేరవేయడంతో అగ్రనేతలు అందుకు అంగీకరించారు. తెలంగాణలో వరుస పర్యటనలతో కేడర్లో జోష్ పెంచనున్నారు. ఈ నెల 15న అమిత్ షా, 25న జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా జరిగే బహిరంగ సభల్లో అమిత్ షా, జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఈనెల 15న ఖమ్మం పార్లమెంట్లో జరిగే సభకు అమిత్ షా హాజరుకానున్నారు. 25న నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో జరిగే సభలో జేపీ నడ్డా పాల్గొనన్నారు. ఈనెల 30లోపు హైదరాబాద్ మల్కాజిగిరిలో మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. దాంతో పాటు చివరి వారంలో నల్గొండలో జరిగే బీజేపీ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర నేతలు కూడా మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే పనిలో నిమగ్నమైంది. ఇంటింటికీ వెళ్లి.. కేంద్రంలో బీజేపీ 9 ఏళ్లలో చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేసేందుకు కేడర్కు దిశానిర్దేశం చేసింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు యాక్టివ్గా పాల్గొనాలని రాష్ట్ర నేతలు సూచించారు. ఈ కార్యక్రమంతో పాటు బీజేపీ సమీక్షలు, సమావేశాలతో బిజీగా ఉంటోంది. ఇవాళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల సమావేశం కూడా నిర్వహించింది. ఈ సమావేశానికి సునీల్ బన్సల్, బండి సంజయ్, బీజేపీ ముఖ్యనేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఎన్నికల ఏడాది కావడంతో భవిష్యత్లో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు.