అబిడ్స్లో బీజేపీ నేత లక్ష్మణ్ అరెస్ట్.. ఈటల, హరీశ్ కూడా ద్రోహులే: లక్ష్మణ్
హైదరాబాద్ అబిడ్స్ సర్కిల్ దగ్గర బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు లక్ష్మణ్ సహా బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదని ఈ సందర్భంగా లక్ష్మణ్ మండిపడ్డారు. పదవులు శాశ్వతం కాదని టీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని లక్ష్మణ్ సూచించారు. ఉద్యమంలో పాల్గొనని వారిని ద్రోహులని టీఆర్ఎస్ నేతలు గతంలో అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కార్మికుల ఉద్యమంలో పాల్గొనని మంత్రులు ఈటల, హరీశ్రావు కూడా ద్రోహులేనని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజలు ముఖ్యమా, పదవులా అని ప్రశ్నించారు. ఇది నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న పోరు అని ఆర్టీసీ కార్మికుల సమ్మె సకల జనుల సమ్మెగా మారుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.