Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్ డేట్.. ఫైనల్ లిస్టుకు మార్చి 31 డెడ్ లైన్
Indiramma Housing Scheme: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. జనవరి 26వ తేదీన లాంఛనంగా స్కీమ్ ను ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయిలో లబ్దిదారులను గుర్తించే ప్రక్రియ మార్చి 31వ తేదీలోపు పూర్తి కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు.
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పట్టాలెక్కింది. జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండలాల్లోని ఒక గ్రామం లబ్దిదారులను గుర్తించారు. ఈ మేరకు వారికి ప్రొసీడింగ్స్ కాపీలను అందించారు. లాంఛనంగా పథకం ప్రారంభం అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా లబ్దిదారులను ఎప్పటిలోగా గుర్తిస్తారనే సందేహాలు ఉన్నాయి. చాలా మంది ఆశావాహులు నిరాశకు లోనవుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి స్పష్టమైన ప్రకటన చేశారు.
నారాయణపేట జిల్లా కోస్గీ మండలంలో చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లపై సీఎం మాట్లాడారు. ఇందిరమ్మ పథకానికి ఎంపికైన లబ్దిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..అర్హులైన చివరి లబ్దిదారుడి వరకు సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. మార్చి 31లోపు తెలంగాణలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి సెగ్మెంట్ లో 3,500 చొప్పున ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులను గుర్తిస్తామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఇందుకు ప్రభుత్వం 22,500కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నటు వివరించారు.
ప్రస్తుతం విడదులైన అర్హత జాబితాలోని పేర్లతోపాటు కొత్త దరఖాస్తులను పరిశీలించనుంది. అర్హత గలవారి వివరాలను మరోసారి అన్నికోణాల్లో పరిశీలించనున్నారు. ఇందిరమ్మ కమిటీల సాయంతో లబ్దిదారులను గుర్తించనున్నారు. ఫిబ్రవరి మొదటివారం నుంచి మార్చి 31వ తేదీలోపు అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్దిదారుల ప్రక్రియను పూర్తి చేసే ఛాన్స్ ఉంది. ఆ దిశగా అధికార యంత్రాంగం కూడా కసరత్తు ప్రారంభించింది.