AP and Ts Rtc Higher Officials Meeting : ముగిసిన ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం

Update: 2020-09-15 13:39 GMT

AP and Ts Rtc Higher Officials Meeting : కరోనా లాక్ డౌన్ కారణంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య నిలిపివేసిన ఆర్టీసీ సర్వీసులను పునరుద్దరించేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ రూట్ల వారీగా రెండు రాష్ట్రాలు సమానంగా నడపాలని ప్రపోజ్ చేశామన్నారు. రెండు రాష్ట్రాలు అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళతాం అని సునీల్‌ శర్మ అన్నారు. రూట్ల వారీగా క్లారిటీ ఇస్తేనే మేము ముందుకు వెళ్తామన్నారు.

అనంతరం ఎండీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశంలో అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ, కిలోమీటర్లపై చర్చ జరిగిందని ఆయన తెలిపారు. బస్సుల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ పంపించామన్నారు. ఏ రూట్లలో ఎన్ని బస్సులు నడపాలనే అంశంపైనా చర్చించామని ఆయన అన్నారు. కిలోమీటర్ల గ్యాప్‌ 50 శాతం తగ్గించేందుకు మేము అంగీకరించామన్నారు. సమాన కిలోమీటర్లకు ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతుందన్నారు. రాష్ట్రాల విభజన అనంతరం తెలంగాణ లో 2.65 లక్షల కిలోమీటర్లకు బస్సులు తిప్పుతున్నామన్నారు. రాష్ట్ర విభజనకు ముందు 3.43 లక్షల కిలోమీటర్లు ఏపీ బస్సులను నడిపాం. తెలంగాణ ఆర్టీసీని 50శాతం పెంచుకోమని చెప్పామని తెలిపారు. 1.10 వేల కిలోమీటర్ల నుంచి 1.60 వెల కిలోమీటర్లు వరకు పెంచడానికి తెలంగాణ ముందుకు వచ్చింది. 1.1 లక్షల కిలోమీటర్లు రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ ఉంది. మేము 50 వేల కిలోమీటర్లు తగ్గిస్తాం. 71 రూట్లలో ఏపీ, 28 రూట్లలో తెలంగాణ బస్సులు తిప్పుతుందన్నారు. అంతకు మించి పెంచే సామర్ధ్యం మాకు లేదన్నారు.

అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీఎస్ ఆర్టీసీకి అనుమతి ఉందన్నారు. 70 వేల కిలోమీటర్లు మేర ఇరు రాష్ట్రాలు 250 బస్సులు తిప్పితే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని భావించమన్నారు. రెండు రోజుల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రూట్ వైజ్ క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ అడిగిందన్నారు. సర్వీసుల పునరుద్ధరణపై ప్రతిష్టంభన ఇలానే ఉంటే ప్రైవేట్‌కు లాభం చేకూరుతుందన్నారు. తుది నిర్ణయం తీసుకునే వరకు ఇరు రాష్ట్రాలు 250 బస్సుల చొప్పున నడిపేందుకు అనుమతి ఇవ్వాలని అడిగాం. సమావేశంలో తెలంగాణ నుంచి టీఎస్‌ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌ శర్మ‌, ఇతర ఉన్నతాధికారులు.. ఏపీ నుంచి ఎండీ కృష్ణబాబు, ఈడీ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News