భవిష్యత్ కార్యాచరణపై ఇవాళ సాయంత్రానికి క్లారిటీ : సీఎం కేసిఆర్
తెలంగాణలో లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతుందని అందుకే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కేసిఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణలో లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతుందని అందుకే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కేసిఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు లాక్ డౌన్ కు సహకరించి, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే కరోనా వ్యాప్తి నిరోధానికి పరిస్థితి మెరుగవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో జరిగే ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో తర్వాత భవిష్యత్ కార్యాచణపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తీరు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కరోనా వైరస్ చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో మరణాలు రేటు జాతీయ సగటుకన్నా తక్కువ వుండడం కొంత ఊరటనిచ్చే అంశమని సీఎం అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ ను మరికొంత కాలం ఇదే పద్ధతిలో కొనసాగిస్తే, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఇవాళ కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో 1001 చేరింది. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 316 కాగా.. ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి 25 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో 660 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ తొమ్మిది మంది డిశ్చార్జ్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన అత్యధిక కేసులు ఒక్క హైదరాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం. హైదరాబాదులో 540 కేసులు నిర్ధారణ అయ్యాయి.