Rinku Singh : రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం.. క్యాన్సర్తో పోరాడుతూ తండ్రి కన్నుమూత
రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం.. క్యాన్సర్తో పోరాడుతూ తండ్రి కన్నుమూత
Rinku Singh : భారత యువ క్రికెటర్, సిక్సర్ల కింగ్ రింకూ సింగ్ ఇంట్లో తీరని విషాదం నెలకొంది. గత కొంతకాలంగా ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఆయన తండ్రి ఖచందర్ సింగ్ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఖచందర్ సింగ్ స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలో చేర్పించి వెంటిలేటర్ సపోర్ట్ అందించారు. తండ్రి మరణవార్త విన్న రింకూ సింగ్ కన్నీరుమున్నీరవుతున్నారు.
టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టుతో ఉన్న రింకూ సింగ్, తండ్రి పరిస్థితి విషమంగా ఉందని తెలియగానే హుటాహుటిన ఇంటికి బయలుదేరారు. మంగళవారం చెన్నైలో జరిగిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో రింకూ కనిపించకపోవడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఆ తర్వాత ఆయన తండ్రి ఆరోగ్యం బాగోలేదని, అందుకే అలీఘర్లోని తన ఇంటికి వెళ్లారని వార్తలు వచ్చాయి. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. ఖచందర్ సింగ్కు కిడ్నీ సమస్యలు కూడా తోడవడంతో రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ (డయాలసిస్ వంటిది) అందిస్తూ ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు.
రింకూ సింగ్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే తండ్రి కష్టాలను చూస్తూ పెరిగిన రింకూ, తన కష్టంతో టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగారు. తండ్రికి మంచి వైద్యం అందించాలని, సుఖంగా ఉంచాలని ఎంతో తాపత్రయపడే రింకూకు ఇది కోలుకోలేని దెబ్బ. బుధవారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మాట్లాడుతూ.. రింకూ త్వరలోనే జట్టుతో చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, ఇప్పుడు తండ్రి మరణించడంతో ఆయన మళ్ళీ వరల్డ్ కప్ జట్టులోకి ఎప్పుడు వస్తారనే దానిపై స్పష్టత లేదు.
ప్రస్తుతం రింకూ సింగ్ తన స్వస్థలమైన అలీఘర్లో ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. తోటి క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా రింకూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ యువ క్రికెటర్ ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. భారత్ తదుపరి మ్యాచ్ వెస్టిండీస్తో ఉన్న నేపథ్యంలో రింకూ సేవలను టీమిండియా కోల్పోయే అవకాశం కనిపిస్తోంది.