Team India : రిషబ్ పంత్‌కు వన్డేల్లోనూ ఉద్వాసన? ఆ ప్లేయర్‌ సెంచరీ దెబ్బకు రూట్ క్లియర్

Team India : టీమిండియా సెలక్షన్ కమిటీ త్వరలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది.

CR Reddy
Published on: 28 Dec 2025 10:37 AM IST
Team India
X

Team India : రిషబ్ పంత్‌కు వన్డేల్లోనూ ఉద్వాసన? ఆ ప్లేయర్‌ సెంచరీ దెబ్బకు రూట్ క్లియర్

Team India: టీమిండియా సెలక్షన్ కమిటీ త్వరలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌లో చోటు కోల్పోయిన ఒక స్టార్ క్రికెటర్‌ను, ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పించాలని బీసీసీఐ భావిస్తోంది. అతని స్థానంలో దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న మరో యువ ఆటగాడికి అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

పంత్ స్థానానికి ఎసరు

న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి 18 వరకు జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును జనవరి 3 లేదా 4వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సిరీస్ నుంచి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను తప్పించనున్నారు. పంత్ చివరగా 2024 ఆగస్టులో శ్రీలంకపై వన్డే ఆడాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా సిరీస్‌లో జట్టులో ఉన్నప్పటికీ, తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం టీమ్ మేనేజ్‌మెంట్ కేఎల్ రాహుల్‌ను మొదటి ప్రాధాన్యత కలిగిన కీపర్‌గా భావిస్తుండటంతో, పంత్‌ను పక్కన పెట్టి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు.

ఇషాన్ కిషన్ రీ-ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్

దాదాపు రెండేళ్లుగా వన్డే జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్, ఇప్పుడు అదిరిపోయే ఫామ్‌తో తిరిగి వస్తున్నాడు. 2023 ప్రపంచకప్ తర్వాత మళ్ళీ కిషన్‌కు వన్డేల్లో ఛాన్స్ దక్కలేదు. అయితే, తాజాగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టును విజేతగా నిలపడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో సెంచరీ బాదడమే కాకుండా, విజయ్ హజారే ట్రోఫీలో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని లిస్ట్-ఏ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. ఈ ఆకాశమే హద్దుగా సాగుతున్న ఇషాన్ కిషన్ ఫామ్ చూసి, సెలక్టర్లు అతడిని న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేయడం ఖాయమనిపిస్తోంది.

సెలక్టర్ల కొత్త వ్యూహం

టీ20 ప్రపంచకప్ 2026 ప్రణాళికల్లో భాగంగా పంత్‌ను ఇప్పటికే దూరం పెట్టారు. ఇప్పుడు వన్డేల్లో కూడా అదే ఫార్ములాను అమలు చేయాలని బీసీసీఐ చూస్తోంది. పంత్ కేవలం టెస్టులకే పరిమితం కావచ్చని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇషాన్ కిషన్ లేదా సంజు శాంసన్ వంటి ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇవ్వాలని గంభీర్ అండ్ కో భావిస్తోంది. పంత్ ఫామ్ కంటే కూడా కిషన్ ఇస్తున్న వేగవంతమైన ఆరంభాలు టీమ్ ఇండియాకు ఇప్పుడు చాలా అవసరం. మరి న్యూజిలాండ్ పర్యటనతో కిషన్ అదృష్టం మళ్ళీ మారుతుందో లేదో వేచి చూడాలి.

CR Reddy

CR Reddy

Next Story