మే నెలలో ఐపీఎల్ ఉంటుందా? ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణపై అనిశ్చితి
ఐపీఎల్ 13వ సీజన్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే మిగిలింది.
ఐపీఎల్ 13వ సీజన్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే మిగిలింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 29న తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ప్రారంభంకావాల్సింది. లాక్ డౌన్ కారణంగా బీసీసీఐ ఐపీఎల్ ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసింది. తాజాగా లాక్డౌన్ పొడిగించడంతో ఈ విషయంపై మరింత మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. భారత్లో కరోనా వైరస్ ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో మే 3 వరకూ లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. దీంతో ఈ సీజన్ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది.
లాక్డౌన్ను పొడిగించడంతో ఈసారి మెగా టోర్నీపై సందేహాలు నెలకొన్నాయి. అంతకుముందే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్19 విస్తరించడంతో.. కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీసీసీఐ మే 3 వరకూ ఏ నిర్ణయం తీసుకునేలా కనిపించడం లేదు. మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ... వచ్చే నెల మధ్య వరకూ మెగా టోర్నీని నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్ళు ఎక్కడ నుంచి వస్తారని ఘాటుగా స్పందించారు.