Team India : నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా బ్యాటర్ల ఫ్లాప్ షో.. రికార్డులు చూస్తే భయపడాల్సిందే!
నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా బ్యాటర్ల ఫ్లాప్ షో.. రికార్డులు చూస్తే భయపడాల్సిందే!
Team India : అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం.. ఆదివారం (ఫిబ్రవరి 22) సాయంత్రం.. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా..టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 సమరంలో ఇదో హై-వోల్టేజ్ పోరు. 2024 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మళ్లీ ఈ రెండు దిగ్గజ జట్లు ప్రపంచ వేదికపై తలపడుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ మ్యాచ్కు ముందు టీమ్ ఇండియాను ప్రధానంగా ఒక ప్రశ్న వేధిస్తోంది.. అదే అభిషేక్ శర్మ ఫామ్. ఈ మెగా టోర్నీలో స్టార్ ఓపెనర్గా అడుగుపెట్టిన అభిషేక్, ఇప్పటివరకు ఆడిన మూడు ఇన్నింగ్స్ల్లోనూ కనీసం ఖాతా తెరవకుండానే వెనుదిరగడం ఆందోళన కలిగిస్తోంది.
కేవలం అభిషేక్ శర్మ మాత్రమే కాదు, అహ్మదాబాద్లోని పిచ్ పరిస్థితులు భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లందరికీ అగ్నిపరీక్షగా మారనున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే, ఇక్కడ మన స్టార్ల రికార్డులు ఏమంత ఆశాజనకంగా లేవు. ఈ మైదానంలో అభిషేక్ శర్మ 2 మ్యాచ్ల్లో కేవలం 34 పరుగులే చేయగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 5 ఇన్నింగ్స్ల్లో 152 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక ఇషాన్ కిషన్ 4 ఇన్నింగ్స్ల్లో 79 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. తిలక్ వర్మ కూడా వేగంగా ఆడటంలో ఇబ్బంది పడుతున్న తరుణంలో, టీమిండియా ఇన్నింగ్స్ను ఎవరు నిలబెడతారనేది ప్రశ్నార్థకంగా మారింది.
టాప్ ఆర్డర్ విఫలమైతే భారత ఆశలన్నీ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపైనే ఉన్నాయి. ఈ మైదానంలో హార్దిక్ రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. అహ్మదాబాద్లో ఆడిన 7 ఇన్నింగ్స్ల్లో 35 సగటుతో 209 పరుగులు చేశాడు. మరీ ముఖ్యంగా 168కి పైగా స్ట్రైక్ రేట్తో విరుచుకుపడే సత్తా అతడికి ఉంది. విరాట్ కోహ్లీ తర్వాత ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు హార్దిక్దే. ప్రస్తుత వరల్డ్ కప్లో కూడా పాండ్యా మంచి టచ్లో ఉండటం భారత్కు ఊరటనిచ్చే అంశం. హార్దిక్తో పాటు శివమ్ దూబే (2 మ్యాచ్లు, 76 పరుగులు) కూడా లోయర్ ఆర్డర్లో కీలకం కానున్నాడు.
భారత జట్టు గత రెండు నెలల్లో ఈ మైదానంలో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడింది. కానీ సౌతాఫ్రికా జట్టు మాత్రం గత రెండు వారాల్లోనే ఇక్కడ రెండు మ్యాచ్లు ఆడి పిచ్ పరిస్థితులపై పూర్తి అవగాహన పెంచుకుంది. పరిస్థితులకు తగ్గట్లుగా వారు త్వరగా అలవాటు పడటం టీమ్ ఇండియాకు ప్రమాదకరంగా మారవచ్చు. కగిసో రబాడా, అన్రిచ్ నోర్ట్జే వంటి ఫాస్ట్ బౌలర్లను అహ్మదాబాద్ పిచ్పై ఎదుర్కోవడం అంత సులభం కాదు. భారత్ ఈ మ్యాచ్లో గెలవాలంటే టాప్ ఆర్డర్ సమష్టిగా రాణించడం అత్యవసరం.