Viral Video : ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం..రీల్స్ పిచ్చితో రైలు కింద పడుకున్న యువకుడు
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం..రీల్స్ పిచ్చితో రైలు కింద పడుకున్న యువకుడు
Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియా అనేది కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా, ఒక వ్యసనంగా మారిపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో పాపులర్ అవ్వాలనే పిచ్చితో చాలామంది తమ బాధ్యతను మరిచిపోతున్నారు. ఎత్తైన భవనాల పైనుంచి దూకడం, వేగంగా వెళ్లే వాహనాలపై స్టంట్లు చేయడం వంటివి సాధారణమైపోయాయి. ఈ క్రమంలోనే @ankurtweetsyo అనే యూజర్ షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది.
ఈ వీడియోలో ఒక యువకుడు రైల్వే ట్రాక్పై అడ్డంగా పడుకుని ఉండటం కనిపిస్తుంది. ఇంతలో వేగంగా ఒక రైలు రావడం చూసి కూడా అతను అక్కడి నుంచి లేవలేదు. అతడి స్నేహితుడు పక్కనే ఉండి మొబైల్ కెమెరాతో అంతా రికార్డ్ చేస్తూ, ఆ యువకుడికి సూచనలు ఇస్తూ కనిపించాడు. రైలు ఆ యువకుడి మీద నుంచి వెళ్తున్నప్పుడు ఆ దృశ్యం చూసే ఎవరికైనా గుండె ఆగినంత పని అవుతుంది. చిన్న పొరపాటు జరిగినా ఆ యువకుడు ముక్కలు ముక్కలు అయిపోయేవాడు.
రైలు వెళ్ళిపోయిన తర్వాత ఆ యువకుడు లేచి గెంతుతూ సంబరాలు చేసుకోవడం మరింత విస్మయానికి గురిచేస్తోంది. తనేదో ఒలింపిక్ మెడల్ సాధించినట్లుగా ఆ యువకుడు, అతని స్నేహితుడు ప్రవర్తించారు. చావు అంచుల్లోకి వెళ్ళి వచ్చినా వారి ముఖాల్లో భయం కానీ, పశ్చాత్తాపం కానీ కనిపించలేదు. కేవలం ఆ వీడియోను నెట్లో పెట్టి లైకులు సంపాదించాలనే తాపత్రయమే వారిలో కనిపించింది.
Pure stupidity in the name of content 💀☠️ pic.twitter.com/bkLddxcG7X
— @ñkür🔭 (@ankurtweetsyo) February 2, 2026
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. "ఇలాంటి వారికి వ్యూస్ కాదు, పోలీసులు తగిన శాస్తి చేయాలి" అని కొందరు కామెంట్ చేస్తుంటే, "తల్లిదండ్రులు ఇంత కష్టపడి పెంచితే, ఒక్క నిమిషం పాపులారిటీ కోసం ఇలా ప్రాణాలు తీసుకోవడమేంటి?" అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. రైల్వే చట్టాల ప్రకారం ట్రాక్లపై ఇలాంటి పనులు చేయడం నేరం. ఇలాంటి ప్రమాదకరమైన ట్రెండ్లకు చెక్ పెట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని సామాజిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.