Viral News: బ్రిటన్ రాణికి నిజాం రాజు నెక్లెస్ బహుమతి.. దాని విలువ ఎంతో తెలుసా?
ఈ రోజుల్లో బిలియనీర్ అనే పదం ఎంతో సాధారణంగా వినిపిస్తోంది. కానీ దాదాపు 80 సంవత్సరాల క్రితం ఈ స్థాయిలో ధనవంతుడిని చూడటం చాలా అరుదైన విషయం.
Viral News: బ్రిటన్ రాణికి నిజాం రాజు నెక్లెస్ బహుమతి.. దాని విలువ ఎంతో తెలుసా?
Viral News: ఈ రోజుల్లో బిలియనీర్ అనే పదం ఎంతో సాధారణంగా వినిపిస్తోంది. కానీ దాదాపు 80 సంవత్సరాల క్రితం ఈ స్థాయిలో ధనవంతుడిని చూడటం చాలా అరుదైన విషయం. అలాంటి కాలంలోనే హైదరాబాద్ సంస్థానానికి పాలకుడిగా ఉన్న 7వ నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన అపార సంపదతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సంపద విలువ అప్పట్లోనే రూ. 1700 కోట్లుగా అంచనా వేశారు.
బ్రిటన్తో ఎంతో మంచి సంబంధాలు కొనసాగించిన నిజాం, 1947లో రాణి ఎలిజబెత్ వివాహానికి ఆహ్వానం అందుకున్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయారు. అయితే, ఈ సందర్భాన్ని గుర్తుగా బహుమతిగా విలువైన వజ్రాల హారాన్ని పంపారు. రాణికి తన ఇష్టమైన డిజైన్ను ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చారు. ఆమె ఎంపిక ప్రకారం కార్టియర్ అనే ప్రఖ్యాత జువెలరీ బ్రాండ్ ప్రత్యేకంగా 300 వజ్రాలను ప్లాటినం మీద అమర్చి ఈ హారాన్ని తయారు చేసింది. దీనిని బ్రిటిష్ సంప్రదాయ ‘రోజ్ డిజైన్’ ఆధారంగా రూపొందించారు.
ఈ హారాన్ని రాణి ఎలిజబెత్ రాజసింహాసనం అధిష్ఠించే ముందు తన అధికారిక ఫొటోలో ధరించారు. అలాగే, 2014లో కేట్ మిడిల్టన్ కూడా ఈ హారాన్ని ధరించి ఫొటో షూట్ చేశారు. తాజా మార్కెట్ విలువ ప్రకారం, ఈ ఆభరణం ధర సుమారుగా రూ.694 కోట్లు ఉంటుందని అంచనా. అందుకే, ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆభరణాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
ప్రస్తుతం ఈ వజ్రాల హారం బ్రిటన్ రాజ కుటుంబ ఆభరణాల సమాహారంలో ఒక ప్రధాన భాగంగా ఉంది. అప్పుడప్పుడు ముఖ్యమైన వేడుకల్లో రాజ కుటుంబ సభ్యులు దీన్ని ధరిస్తూ కనిపిస్తారు. 2022లో బ్రిటన్ రాజ కుటుంబ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ హారాన్ని ప్రజలకు ప్రదర్శించారు.
నిజాం వద్ద ఉన్న వజ్రాల సంపద గురించి అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన చర్చలు జరిగేవి. ఆయన దగ్గర జేకబ్ డైమండ్, సట్లాడా హారం లాంటి ఎన్నో విలువైన ఆభరణాలు ఉండేవి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు భారతదేశంలోని వివిధ మ్యూజియంలలో ప్రజలకు ప్రదర్శిస్తున్నారు.