పిచ్చి పీక్స్.. టిక్ టాక్ కోసం పెంపుడు పిల్లికి ఉరి!

Update: 2020-05-23 03:44 GMT

టిక్ టాక్ పిచ్చి అంతకంతకూ వెర్రితలలు వేస్తోంది. చాలామంది ప్రజలు దీనిబారిన పది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ యాప్ లో లైకులు ఎక్కువ సంపాదించుకోవాలని ప్రాణాంతకమైన పనులు చేస్తున్న వారు కొందరు. ఇతరుల ప్రాణాలను పణంగా పెడుతున్న వారు మరికొందరు. ఇక భార్యా భర్తల మధ్య టిక్ టాక్ పెడుతున్న చిచ్చు గురించి కథలు కథలుగా రోజూ వింటూనే ఉన్నాం. టిక్ టాక్ వ్యాప్తిలో తమిళనాడు చాలా ముందుందని పరిశీలకులు చెబుతారు. అక్కడ టిక్ టాక్ వీడియోల్లో వచ్చే లైకులు సోషల్ స్టేటస్ లా భావిస్తున్న వారు చాలా మంది ఉన్నారని తెలుస్తోంది.

ఈ నేపధ్యంలో ఒక యువకుడు చేసిన క్రూరమైన పని అతనిని కటకటాల పాలు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. టిక్ టాక్ లో లైకుల కోసం ఆ యువకుడు తన పెంపుడు పిల్లిని ఉరివేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి టిక్ టాక్ లో జత చేశాడు. తమిళనాడు తిరునెల్వేలి జిల్లాకు చెందిన పలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 

అక్కడి చెట్టికుళమ్ ప్రాంతానికి చెందినా  తంగదురై ఒక డైరీ ఫాం లో పనిచేస్తున్నాడు. అతను టిక్ టాక్ లో తరచూ వీడియోలు చేస్తుంటాడు. ఇతను తాజాగా ఎక్కువ లైకులు వస్తాయని చెప్పి, తన పెంపుడు పిల్లిని ఉరివేస్తూ ఆ దృశ్యాలను టిక్ టాక్ లో ఉంచాడు. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే, వీటిని చూసిన తిరునల్వేలి జంతు హింస నివారణ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తంగదురై ని పోలీసులు అరెస్ట్ చేశారు. 

టిక్ టాక్ మోజులో పది జీవితాలు పాడు చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  

 



Tags:    

Similar News