ప్రియుడిని పెళ్లి చేసుకోవటానికి మాజీ ప్రియుడు అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ.. ప్రస్తుత ప్రియుడి సహాయంతో మాజీ ప్రియుడ్ని దారుణంగా హత్య చేయించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో చోటుచేసుకుంది. బరేలీకి చెందిన ఉమా శుక్లా అనే మహిళకు గతంలోనే వివాహం జరిగింది. మస్పర్ధల కారణంగా 2014లో భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో యోగేశ్ సక్సేనా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి శారీరక సంబంధానికి దారితీసింది. సంవత్సరం కిందట ఉమా, యోగేశ్ను పెళ్లి చేసుకోవాలనుకుంది.
ఈ ప్రతిపాదనను ప్రియుడు యోగేశ్ కూడా అంగీకరించాడు. అయితే కొద్దీ రోజులుగా వారి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. దీనికి కారణం ఏంటని యోగేష్.. ఉమా ను ప్రశ్నించాడు. ఆమె సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. అయితే ఆమె మౌనానికి కారణం ఏంటని ఆరాతీయగా యోగేష్ కు అసలు నిజం తెలిసింది, ఆమె మరొక యువకునితో సన్నిహితంగా ఉంటోందని గమనించాడు. కాంట్రాక్టు ప్రాతిపదికన ఐవిఆర్ఐ బరేలీలో స్టోర్ కీపర్గా ఉన్న సునీల్ శర్మను ఆమె ప్రేమిస్తోంది. వారిద్దరూ కలిసి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి యోగేష్ అడ్డుచెప్పాడు.
తనను ప్రేమించి మరొక యువకుడిని ఎలా వివాహం చేసుకుంటావని ఆమెను ప్రశ్నించాడు యోగేష్. దీంతో తమ వివాహానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఉమా.. ఎలాగైనా తనను వదిలించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం వేసించి. అందులో భాగంగా సోమవారం రాత్రి వేళ యోగేశ్ను ఒంటరిగా ఓ నిర్మానుష ప్రదేశానికి రప్పించారు. ఇంతలో అదునుకోసం ఎదురు చూస్తున్న సునీల్.. యోగేశ్ అక్కడికి రాగానే కళ్లలో కారం చల్లి, గొంతుకోసి చంపేశాడు. అతడు చనిపోయాడని ధ్రువీకరించుకున్నాక, మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు.
అయితే దారిన పోయే వాళ్ళు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసును ఓ సవాలుగా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నేరస్తుల్ని పట్టుకున్నారు. కేసుపై అదనపు ఎస్పీ (క్రైమ్) ఆర్కె భారతీయ మాట్లాడుతూ.. ఎస్హెచ్ఓ కొత్వాలి గీతేష్ కపిల్ తోపాటు, వారి బృందాలు 24 గంటల్లో కేసును పరిష్కరించడంలో కృషి చేశాయి. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి క్రింద సెక్షన్ 201 కింద కేసు రిజిస్టర్ చేశాము.. నిందితులను కూడా అరెస్ట్ చేశాము అని తెలిపారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని.. ఒక యువకుడు ప్రేళ్ళైనా యువతిని పెళ్లి చేసుకోవాలని.. ఆమె మాజీ ప్రియుడును ప్రియురాలి సహాయంతో హత్య చేసినట్టు వెల్లడించారు.